వైసీపీకి కాదు.. ప్రజలకు విధేయులుగా పని చేయండి

• రాజ్యాంగం కల్పించిన విధివిధానాల ప్రకారం అధికారులు పని చేయాలి
• సహజ వనరుల రక్షణ బాధ్యత వారిదే
• ప్రకృతి సంపద దోపిడీ చేసిన వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తాం
• అధికారమే పరమావధిగా వైసీపీ నాయకుడు హామీలు ఇచ్చాడు
• వస్తున్న సమస్యలు చూస్తే ప్రజలు ఎలా నమ్మారా అని ఆశ్చర్యం వేస్తోంది
• మచిలీపట్నం జనవాణి- జనసేన భరోసా కార్యక్రమంలో ప్రజల సమస్యలు అవగతం చేసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్

‘సహజ వనరులను వైసీపీ నాయకులు ఇష్టానుసారం దోచేస్తున్నారు. వారు చెప్పినట్లు ఐఏఎస్, రెవెన్యూ అధికారులు ఆడుతున్నారు. ప్రజల కోసం, చట్టాల పరిరక్షణ కోసం పని చేయాల్సిన అధికారులు… వైసీపీ నాయకుల కనుసన్నల్లో పని చేయడం సరికాదు. ప్రతి అధికారి విధులకు సంబంధించి రాజ్యాంగంలో చెప్పిన విధంగా విధివిధానాలు ఉన్నాయి. వాటిని అనుసరించి పని చేయాలి తప్పితే ఏ పార్టీకో, నాయకుడో చెప్పినట్లు పని చేయడం సరికాద’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. మంగళవారం మచిలీపట్నంలో జనవాణి- జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సమస్యపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తూ బాధితుల ఆవేదనను మనసుతో విని స్పందించారు. వచ్చిన ప్రతి సమస్యను పరిశీలించి రాబోయే జనసేన, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో దానిని పరిష్కరించే విధానాన్ని వివరించారు. ‘వైసీపీ నాయకుడు మాదిరి నోటికి వచ్చిన హామీ ఇవ్వడం కాకుండా ప్రతి సమస్యపైన సమగ్ర అధ్యయనం చేసి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామ’ని భరోసా ఇచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన దృష్టికి వచ్చిన ప్రధాన సమస్యలపై ఈ విధంగా స్పందించారు…
• విశాఖ ఎర్రమట్టి దిబ్బలు మాదిరి మచిలీపట్నం తీర ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. ఈ ఇసుక దిబ్బలను స్థానిక వైసీపీ నాయకులు అడ్డగోలుగా దోచేస్తున్నారు. తుపాన్లు, సముద్ర అటుపోట్లకు రక్షణ వలయంగా నిలుస్తున్న ఇసుక దిబ్బలను ఇష్టానుసారం దోచేయడం వల్ల ఉప్పు నీరు పొలాల్లోకి ప్రవేశించి పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయని తీర ప్రాంత రైతాంగం వాపోయింది. ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎన్నిసార్లు ఈ సమస్య విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. సహజవనరులు దోచుకోకుండా బలమైన చట్టాలు తీసుకురావాలి. అలాగే అధికారులు బాధ్యతగా వ్యవహరించి సహజవనరుల దోపిడీని ఆరికట్టాలి.
• రాష్ట్రంలోని 1.95 కోట్ల ఇళ్లకు విద్యుత్ మీటర్లు చెక్ చేసి బిల్లులు ఇచ్చే బిల్ రీడర్స్ కడుపు కొట్టాలని ప్రభుత్వం చూస్తోంది. 4 వేల కుటుంబాలకు సంబంధించిన సమస్య ఇది. రీడర్స్ కు ప్రత్యామ్నాయం చూపకుండా వారి పని దినాలు తగ్గించి, వారి కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తున్నారు. ముఖ్యమంత్రి చెప్పే క్లాస్ వార్ ఉద్దేశం నాకు తెలియదు కానీ… క్లాస్ వార్ చేస్తూ పేద, మధ్య తరగతి బతుకులను వైసీపీ ప్రభుత్వం చిధ్రం చేస్తోంది. పేదల పక్షాన నిలబడకుండా, రూ.7 వేల కోట్లు ఎవరికో మీటర్ల కాంట్రాక్టు ఇచ్చేసి వీరిని రోడ్డున పడేసే పరిస్థితి వచ్చింది. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలనే డిమాండును జనసేన పరిగణలోకి తీసుకుంటుంది. జనసేన ప్రభుత్వం రాగానే టీడీపీతో ఈ అంశంపై చర్చించి మీకు న్యాయం జరిగేలా పోరాడుతాను.
• సర్వశిక్ష అభియన్ లో పదేళ్లుగా పీఈటీలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. ఆ హామీ అమలు కాకపోగా 3 నెలలు నుంచి వారికి జీతాలు ఆపేయడం దుర్మార్గం. ధర్నాలు చేస్తే ఉద్యోగాలు ఊడుతాయని బెదిరించడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే. కేంద్రం అందించే పథకాలు రాష్ట్రం దగ్గరకు వచ్చే సరికి నిర్వీర్యం అవుతున్నాయి. జగన్ పాదయాత్ర సమయంలో నోటికి ఏది వస్తే ఆ హామీ ఇచ్చాడు. జనవాణి కార్యక్రమంలో వస్తున్న అర్జీదారులు ‘మాకు ఆ రోజుల్లో జగన్ ఈ హామీ ఇచ్చాడు సర్..’ అని చెబుతుంటే ఇలాంటి వ్యక్తిని జనం ఎలా నమ్మారా అని ఆశ్చర్యం వేస్తోంది. ప్రభుత్వాన్ని చూస్తే భయాందోళనలు ఎందుకు..? నాకు న్యాయం జరగనపుడు గళం విప్పే హక్కు ఉంది. భవిష్యత్తులో ప్రజలకు సమస్యలు వస్తే నిర్భయంగా వచ్చే పరిస్థితులు ఉంటాయి. 6 నెలలు ఈ ప్రభుత్వానికి సమయం ఉంది. కచ్చితంగా ప్రతి సమస్యను గుర్తు పెట్టుకొని, వాటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తాం.
* పంచాయతీల నిధులు దొంగిలించారు
• పంచాయతీలకు సంబంధించిన ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దొంగిలించింది. పంచాయతీల్లో చిన్న చిన్న పనులు చేయడానికి వీలు లేకుండా పోతోంది. విడతల వారీగా పంచాయతీలకు సంబంధించిన రూ.8,660 కోట్ల నిధులను ప్రభుత్వం దొంగలించింది. ఇది దారుణం. కనీసం పంచాయతీలకు తెలియకుండా వారి నిధులను వాడుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది..? ఈ దోపిడీ మీద గతంలో జనసేన పార్టీ బయట పెట్టిన విషయాన్నే కాగ్ కూడా ఇటీవల తన నివేదికలో ప్రస్తావించింది. గ్రామ స్వరాజ్యం వైసీపీ పాలనలో పూర్తిగా అదృశ్యం అయ్యే పరిస్థితి వచ్చింది.
• ప్రజల మంచి నీటి సమస్యను తీర్చేందుకు రూ.7,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ స్కీం నిధులను రాష్ట్రానికి కేటాయించింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంటు కింద రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించలేదు. ఫలితంగా లక్షలాది నీటి కనెక్షన్లు ఇవ్వలేకపోయారు. కనీసం గ్రామాల్లో పది బిందెల నీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇదీ. ప్రజల గొంతు తడపలేని సర్కారు ఇది. నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నాకు తాగునీటి సమస్య మీద అవగాహన ఉంది. రాజకీయ అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని తీసుకువస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయి. 2024లో అలాంటి రాజకీయ అవినీతికి తావులేని ప్రభుత్వాన్ని తీసుకొస్తాం.
• చేనేత బతికుండాలి అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. అలాంటి కళను బతికించుకోవాల్సిన అవసరం ఉంది. చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నేను ఉండటానికి కారణం చేనేత అనేది ఓ గొప్ప కళ. అందుకే వారిని చేనేత కళాకారులు అని పిలుస్తాను. చేనేత సొసైటీలను ప్రభుత్వం పట్టించుకోవాలి. వారికి పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలి. సొసైటీలు లాభదాయంగా ఉండి ఉంటే చేనేతల బతుకులు బాగుండేవి. ఆప్కోను బలోపేతం చేసే దిశగా ఆలోచించడం లేదు. వచ్చే సంకీర్ణ ప్రభుత్వంలో కచ్చితంగా చేనేతలకు సువర్ణ రోజులు వస్తాయని కచ్చితంగా హామీ ఇస్తున్నాను.
• రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల అంతిమ సంస్కారాలకు సంబంధించి ఖబరిస్థాన్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పార్థివదేహం పాతి పెట్టిన స్థలంలోనే అది మట్టిలో కలవక ముందే మరో పార్థివదేహాన్ని పూడ్చిపెడుతున్నారు. కనీసం మృతదేహాలను తరలించడానికి మార్చురీ వ్యాన్ సదుపాయం కూడా లేదు. జనసేన పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వసతులతో కూడిన ఖబరిస్థాన్లు ముస్లింల కోసం నిర్మిస్తాం.