అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలి

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని సమాచారం అందుతోంది. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారు. వారికి అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని చెల్లించాలి. వరి సాగు చేసిన రైతులను ఈ వర్షాలు తీవ్రంగా దెబ్బ తీశాయి. ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగటం లేదు. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఆర్బీకేల్లో తీసుకోకపోవడం వల్ల బస్తాకు రూ.300 నష్టంతో మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోంది. ప్రభుత్వ వైఖరి మూలంగా కష్టపడిన రైతు నష్టపోతున్నాడు. దళారులు, మిల్లర్లు లాభపడుతున్నారు. అదే విధంగా మామిడి నేల రాలిపోయింది. మొక్క జొన్న కూడా మొలకెత్తిపోతోంది. ఈ రైతులకి భరోసా ఇవ్వాలి.
• ప్రత్యేక పాలసీ తీసుకొస్తాం
ప్రకృతి విపత్తులతో నష్టపోయే రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల వేదన కళ్ళారా చూశాను. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వారి పొలాల్లో, కళ్ళాల్లో కలిసినప్పుడు వారుపడ్డ బాధలు తెలుసుకున్నాను. కౌలు రైతు భరోసా యాత్రలో వారి ఆవేదన విన్నాను. ప్రకృతి విపత్తుల మూలంగా పంటలు కోల్పోతున్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తాం. దీనిపై రైతు ప్రతినిధులు, వ్యవసాయ ఆర్థికవేత్తలతో చర్చిస్తున్నాం అని జనసేనాని వివరించారు.