ప్రజల బాగుకోసమే పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్ష: పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 57వ రోజున 39వ డివిజన్ మూలాపేట, చమ్మండి వారి తోట ప్రాంతంలో జరిగింది. ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని పలుకరించిన కేతంరెడ్డికి పలువురు తమ సమస్యలను విన్నవించారు. సావధానంగా ప్రతి ఒక్కరి సమస్యను విన్న కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి తమ వంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్గించారు.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి సంక్షేమం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాతుర్మాస్య దీక్ష చేపట్టారన్నారు. నాలుగు నెలల పాటు సాగే ఈ దీక్షలో దైవ ధ్యానంలో ఉంటూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారన్నారు. ప్రజా సమస్యల అధ్యయనం కోసం అధిక సమయం వెచ్చించేందుకు ఈ సమయాన్ని ఉపయోగిస్తారని, పవనన్న ప్రభుత్వంలో అమలు చేయబోయే ప్రణాళికలను సిద్ధం చేసేందుకు సమయాన్ని కేటాయిస్తున్నారని అన్నారు. జనవాణి జనసేన భరోసా, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల సాయం, ఇలా అనేక విధాలుగా ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు భరోసాగా నిలుస్తున్నారని కేతంరెడ్డి తెలిపారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆశీర్వదిస్తారనే నమ్మకం పవనన్న ప్రజాబాట ద్వారా తమకు కలిగిందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.