బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను, ఆకాంక్షలను అందరూ అర్థం చేసుకోవాలి

భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ గారు భారతీయ సమాజాన్ని కూలంకషంగా అధ్యయనం చేశారు కాబట్టే సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలను చట్ట సభల వైపు నడిపించాలి… ప్రజాస్వామ్య వ్యవస్థలో వారిని భాగస్వాములను చేయాలని సంకల్పించారని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలు చేరాలని తపించారు. ఈ రోజు అంబేడ్కర్ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వకంగా అంజలి ఘటిస్తున్నాను. వర్తమాన సమాజం మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి ఆశయాలను, ఆకాంక్షలను అర్థం చేసుకోవాలి. రాజ్యాంగ రచన కోసం ఆయన ఎంతగా శ్రమించారో తెలుసుకోవాలి. స్త్రీ విద్య గురించి, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారికి హక్కు కల్పించడం గురించి ఏ విధంగా తన అభిప్రాయాలను చర్చల్లో ఎంత బలంగా వినిపించారో నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్ గారి ఆశయాలను అవగాహనపరచుకున్నాం కాబట్టే జనసేన పార్టీ సిద్ధాంతాలపై ఆ ప్రభావం ఉందని స్పష్టంగా చెప్పగలుగుతున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.