పోలవరం ప్రాజెక్టును వైసీపీ నిర్వీర్యం చేసింది

• జగనన్న పాపం పథకంలో పోలవరం మునిగింది
• వచ్చే నెలలో శ్రీ పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టు సందర్శన
• కొవ్వూరు బహిరంగ సభలో వాస్తవాలు వెల్లడి
• ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక్క అడుగూ ముందుకు వేయలేదు
• మొదటి విడత పేరిట ప్రాజెక్టు ఎత్తు ఎందుకు కుదించారు?
• మరమ్మతుల పేరిట రూ. 2030 కోట్ల కేటాయింపు అవినీతి కాదా?
• ఇసుక తోడడం, వరద నీరు తోడటమే మీరు చేసిన మరమ్మతులా?
• జనసేన డిమాండ్లపై సీఎం, సంబంధిత శాఖ మంత్రి చర్చకు రావాలి
• భీమవరంలో మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

పోలవరం ప్రాజెక్టుని శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, ప్రాజెక్టు పూర్తి చేసే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. పోలవరం విషయంలో ప్రభుత్వ చర్యలు రాష్ట్ర ప్రజల్ని, రైతుల్ని మభ్యపెట్టే విధంగా మాత్రమే ఉన్నాయన్నారు. జనసేన పార్టీ పోలవరం నిర్వాసితులు, రైతుల పక్షాన ప్రత్యేక పోరాటం చేస్తుందని తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చే నెలలో పోలవరం ప్రాజెక్టు సందర్శించి, అధికారులతో చర్చలు జరుపుతారని చెప్పారు. పూర్తి సమాచారంతో వాస్తవాలు ప్రజల ముందు పెడతామన్నారు. అదే రోజు సాయంత్రం కొవ్వూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడతామన్నారు. గురువారం భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “రాష్ట్ర విభజన సందర్భంలో మన జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడంతో గొప్ప ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉభయ గోదావరి జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు, 660 గ్రామాలకు తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అంకితభావంతో పని చేసే మన రైతులు అభివృద్ధిలో రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకంటే ముందుంచుతారని నమ్మారు. అయితే ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. మొన్న వచ్చిన వరదల్లో ప్రాజెక్టుకు అపార నష్టం కలిగింది. డయా ఫ్రం వాల్లో మరమ్మతులు చేయాల్సి ఉంది.
* కేంద్రం మాట పెడ చెవిన..
ఆ మరమ్మతులు ఎంత వరకు చేయాలన్న అంశంపై పోలవరం అధారిటీ అధ్యయనం చేస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే విధంగా 45.72 మీటర్ల ఎత్తు ఉండాల్సిన ప్రాజెక్టుని మొదటి విడత పేరు చెప్పి 41.15 మీటర్లకి కుదించి పూర్తి చేస్తామంటూ నిర్ణయం తీసేసుకుంది. ఇది రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం కాదా. కేంద్ర ప్రభుత్వం సీరియస్ అవుతున్నా.. మరమ్మతుల పేరు చెప్పి పోలవరం అధారిటీకి కూడా తెలియకుండా రూ. 2030 కోట్లు విడుదల చేస్తూ జీవో జారి చేసేసింది. ఇది ఈ ప్రభుత్వ అవినీతి కాదా? ఈ ప్రభుత్వానికి నిజంగా నిజాయితీ ఉంటే జనసేన పార్టీ డిమాండ్లపై ముఖ్యమంత్రి, సంబంధిత శాఖా మంత్రి పోలవరంపై చర్చకు రావాలి. ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు. ఇసుక తోడడం కోసం రూ. 200 కోట్లు, వరదల కారణంగా నిలచిన నీటిని ఎత్తిపోయడం కోసం రూ. 70 కోట్లు అని చెబుతున్నారు. మీరు చేపడుతున్న మరమ్మతులు ఇవేనా? రూ. 2030 కోట్లు విడుదల చేసేసి ఈ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. దీన్ని మనమంతా ముక్తకంఠంతో ఖండించాలి.
* నిర్వాసితుల సంఖ్య లక్ష నుంచి 24 వేలకు కుదించేశారు
పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్ల ఎత్తుంటేనే రాష్ట్రానికి మేలు చేయగలుగుతాం. మీరు చెబుతున్న ఎత్తులో విశాఖ వరకు నీరు ఎలా ఇవ్వగలరు. నిర్వాసితులు విషయంలోనూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారు. నిర్వాసిత కుటుంబాలు లక్ష ఉంటే ఈ ప్రభుత్వం 24 వేల మందికి రూ. 10 లక్షల చొప్పున ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ముంపు ప్రాంతాల ప్రజలు వరదల సమయంలో ఈ ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేక అల్లాడుతున్నారు. 11 రోజుల పాటు ఆ ప్రాంతాల్లో కరెంటు లేదు. జనసేన పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో పర్యటించి పార్టీ తరఫున సహాయం చేసి అండగా నిలిచారు. శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం ముంపు ప్రాంతాల పరిధిపై ఉమ్మడి సర్వే చేయమంటే ఎందుకు చేయడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా పాటించకుండా ఎందుకు అబద్దాలు చెబుతున్నారు. గత ఖరీఫ్ కే సాగునీరు ఇస్తామన్నారెక్కడ? ఎంతసేపు విపక్షాల మీద విమర్శలు చేయడం.. ఈ మధ్య కొత్తగా పిట్టకథలు వల్లివేస్తున్నారు.
• వైసీపీని ఇంటికి సాగనంపడమే లక్ష్యం
ముఖ్యమంత్రికి నిజంగా నిజాయితీ ఉంటే ప్రతి బిడ్డ సత్య నాదెళ్ల కావాలన్న కోరిక ఉంటే బైజూస్ పేరిట రూ. 700 కోట్ల స్కామ్ చేస్తారా? ఈ ముఖ్యమంత్రికి సమర్ధత లేదు. పరిపాలనా దక్షత లేదు. జనసేన పార్టీ పోలవరం ప్రాజెక్టు కోసం అవసరం అయితే కేంద్రం బాధ్యత తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది. డ్యామ్ నిర్మాణం త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పని చేస్తుంది. ప్రతిపక్ష ఓటు చీలకుండా నిజాయితీగా ప్రయత్నం చేస్తాం. దానికి అనుగుణంగానే పరిణామాలు ఉంటాయి. మన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ ఎన్నికలలో.. రాష్ట్రానికి అన్యాయం చేసిన వైసీపీని ఇంటికి పంపాల”ని అన్నారు.
* శ్రీ వెంకట సాయిబాబా ఆలయ వార్షికోత్సవాల్లో..
అంతకు ముందు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పార్టీ నాయకులు శ్రీ మల్లినీడి బాబి నిర్వహణలో ఉన్న భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ వెంకట సాయిబాబ ఆలయ ద్వాదశ వార్షిక మహోత్సవాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఆలయ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన శ్రీ మనోహర్ గారికి ఆలయ నిర్వాహక కమిటీ మంగళవాద్యాలు, వేద మంత్రాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని శ్రీ మనోహర్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని శ్రీ మల్లినీడి బాబి సద్వినియోగం చేసుకున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ చేగొండి హరిరామజోగయ్య గారు పాల్గొన్నారు.
* ప్రజల దాహార్తి తీర్చేందుకు….
వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకర్లను ఈ సందర్బంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రారంభించారు. ఈ మూడు ట్యాంకర్లను జనసేన పార్టీ తరఫున నిత్యం ఉంగుటూరు నియోజకవర్గ ప్రజలకు నీరందించేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, పీఏసీ సభ్యులు శ్రీ కనకరాజు సూరి, శ్రీ చేగొండి సూర్యప్రకాష్, శ్రీ పంతం నానాజీ, శ్రీ పితాని బాలకృష్ణ, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నేతలు బొలిశెట్టి శ్రీనివాస్, విడివాడ రామచంద్రరావు, రెడ్డి అప్పలనాయుడు, మేకా ఈశ్వరయ్య, శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, మేకా ఈశ్వరయ్య, చిర్రి బాలరాజు, యిర్రంకి సూర్యారావు, జుత్తిగ నాగరాజు, పత్సమట్ల ధర్మరాజు, కరాటం సాయి, చెన్నమల చంద్రశేఖర్, వై.శ్రీనివాస్, చాగంటి మురళీ కృష్ణ , టి.వి.రామారావు, సువర్ణ రాజు తదితరులు పాల్గొన్నారు.