జి.రాగంపేట ప్రమాదంలో కార్మికుల దుర్మరణం విచారకరం

పెద్దాపురం నియోజకవర్గం జి.రాగంపేటలోని అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్స్ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వడం విచారకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. మృతుల కుటుంబాలకు ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చెల్లించిన విధంగా పరిహారం ఇవ్వడంతోపాటు తగిన ఉపాధి అవకాశాలు చూపించేలా ప్రభుత్వం ముందుకు రావాలి. రాష్ట్రంలోని పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నా ప్రభుత్వం తగిన సమీక్షలు చేపట్టడం లేదు. పరిశ్రమల్లో రక్షణ చర్యల గురించి సంబంధిత శాఖలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నా ఆ దిశగా చర్యలు లేవు. ఫలితంగా రెక్కల కష్టం మీద బతికే కార్మికులు మృత్యువాతపడుతున్నారు. వారిపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతోంది.