పాదయాత్రలో మీడియాపై ఆంక్షలు సరికాదు

మహా టీవీ ఎం.డి.ని అడ్డుకోవడం విధులను అడ్డుకోవడమే.
రాజధాని రైతులు చేపట్టిన పాదయాత్ర వార్తలను కవర్ చేసేందుకు వెళ్తున్న మీడియా ప్రతినిధులను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. పాదయాత్రకు సంబంధించిన వార్తలు, విజువల్స్ సేకరించాల్సిన అవసరం లేదని బాధ్యత కలిగిన పోలీసు ఉన్నతాధికారులే చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీడియా ఏం చేయాలో కూడా వైసీపీ ప్రభుత్వమే చెబుతూ, పాత్రికేయులను నియంత్రించడం కచ్చితంగా నియంతృత్వ పోకడే. ప్రకాశం జిల్లాలో సాగుతున్న రైతుల పాదయాత్రను కవర్ చేసేందుకు వెళ్ళిన మహా టీవీ ఎం.డి., పాత్రికేయుడు శ్రీ వంశీని, పలువురు విలేకర్లను పోలీసులు అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించడాన్ని జనసేన పార్టీ ఖండిస్తుంది. పాత్రికేయులపై ఆంక్షలు విధించడం మానుకోవాలని శ్రీ నాదెండ్ల మనోహర్ కోరారు.