మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

దేశంలో మహిళల సామాజిక ఆర్థిక స్థితిగతులు మారడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. “అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. కుటుంబం, సమాజం, దేశానికి వారు స్ఫూర్తిదాయకం. భారత్లో ప్రతి రంగంలో మహిళలు తమదైన ముద్ర వేశారు. విశిష్ట పాత్రతో దేశ ప్రగతికి గణనీయమైన కృషి చేశారు. అయితే, దేశంలో మహిళల సామాజిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి ఇంకా ఎంతో చేయాల్సిఉంది. వారి భద్రత, విద్య, స్వాతంత్ర్యం కోసం మనందరం అవిరామంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే అతివలు, ముఖ్యంగా మన కూతుళ్లు.. మరింత శక్తిమంతంగా, సమర్థవంతంగా తయారై, సాధికారత సాధించేందుకు వీలవుతుంది.” ఈ మహిళా దినోత్సవాన్ని.. అతివల భద్రత, సాధికారత కోసం అంకితమివ్వాలని కోవింద్ పిలుపునిచ్చారు. వారి పురోగతికి ఆటంకం కలిగించే ప్రతి సంప్రదాయం, విధానాన్ని మార్చడంలో మద్దతుగా నిలుస్తామని చెప్పారు.