పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి: రాటాల రామయ్య

సిద్ధవటం, కరెంటు చార్జీలు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై మోయలేని పెనుబారం మోపుతున్నారని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని పాదయాత్రలో ప్రతి ఊరు తిరిగి చెప్పిన జగన్ మాట తప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం 6వ సారీ మళ్ళీ విద్యుత్ చార్జీలు పెంచడం దారుణమన్నారు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను గొప్పగా ప్రచారం చేస్తూ, ప్రభుత్వం మరోవైపు విద్యుత్ చార్జీలను భారీగా పెంచి పేదలను మోసగిస్తుందని విమర్శించారు. విద్యుత్ చార్జీలు పెరిగితే గృహ వినియోగం దగ్గర నుండి నిత్యావసర వస్తువుల వరకు ధరలు విపరీతంగా పెరుగుతాయని అన్నారు. జగన్ ప్రభుత్వం తీరువలన విద్యుత్ చార్జీలు ఎప్పటికప్పుడు పెట్రోల్ గ్యాస్ ధరలు లాగే పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోకపోతే రాబోయే 2024 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని రాటాల రామయ్య హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.