జనసేన – తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం తీర్మానాలు

రాజమండ్రిలో సోమవారం నిర్వహించిన జనసేన – తెలుగు దేశం సమన్వయ కమిటీ సమావేశంలో మూడు తీర్మానాలను ఆమోదించారు. ఆ తీర్మానాలివి…
తీర్మానం 1:
వైసీపీ పాలనలో వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. ప్రజా సమస్యలపై పోరాడే ప్రతిపక్ష పార్టీల నేతలను నిర్భందాలకు గురి చేస్తున్న అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ప్రజా ఉద్యమాలు చేపట్టరాదనే విధంగా నియంత పాలన కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును టీడీపీ-జనసేన సమన్వయ సమావేశం తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాసమస్యలపై నిలదీస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతున్నారనే దురుద్దేశంతో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. పలు కేసుల పేరుతో చంద్రబాబు గారిని వీలైనంత ఎక్కువ కాలం జైల్లోనే నిర్బంధించాలనే కుట్ర జరుగుతోంది. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమ అరెస్టులు వైసీపీ పాలనలోకి వచ్చిన క్షణం నుంచే మొదలయ్యాయి. సి‌పి‌ఐ, సిపిఎం, బీజేపీ, జనసేన, తెలుగుదేశం.. ఇలా ప్రతి ప్రతిపక్ష పార్టీని వేధించడం ప్రారంభించారు. క్షేత్ర స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకూ అందరిపైనా అక్రమ కేసులు నమోదు చేయడం, నిర్బంధాలు చేయడం… రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం చేస్తున్నారు. ఇందుకు పరాకాష్ట చంద్రబాబు నాయుడు గారి అరెస్టు. అక్రమంగా, అమానుషంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసి వేధింపులకు గురి చేస్తున్నారు. అభివృద్ధి అనే మాట విడిచిపెట్టి వైసీపీ పాలకులు సాగిస్తున్న పాలసీ టెర్రరిజం ఇది. ఎటువంటి మచ్చ లేకుండా ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా, గత 45 ఏళ్లగా తెలుగు జాతి ఉన్నతికి, ఉమ్మడి, నవ్యాంధ్ర రాష్ట్రాల అభివృద్ధి, శ్రేయస్సుకు అహర్నిశలూ శ్రమించిన నిత్యకృషీవలుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ విధంగా నిర్బంధించడాన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. చంద్రబాబు గారి అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రం, దేశం, విదేశాల్లో స్వచ్ఛందంగా నిరసనలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కాముకులు, ప్రజాస్వామ్యవాదులకు ఈ రెండు పార్టీలు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ సమావేశం తీర్మానం చేస్తుంది. ఈ అక్రమ అరెస్టుపై ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపడుతున్న తెలుగు దేశం, జనసేన పార్టీల నాయకులు, శ్రేణులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని ఈ సమావేశం ఖండిస్తుంది.
తీర్మానం 2:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అరాచక పాలకుల నుంచి కాపాడుకొని అభివృద్ధి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇందుకోసం ఐక్య కార్యాచరణతో ముందడుగు వేయాలని చారిత్రక నిర్ణయం తీసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికీ, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నాం. ఈ మేలు కలయికను… పొత్తు ఆవశ్యకతను మనసారా స్వాగతించిన ఇరు పార్టీల నాయకులను, కార్యకర్తలను, ప్రజలను అభినందిస్తూ తీర్మానం చేస్తున్నాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ, జనసేన కలిసి పని చేయటం కొత్తగా తీసుకున్న నిర్ణయంకాదు. 2014 ఎన్నికలప్పుడు కూడా ఇరు పార్టీలు కలిసి పనిచేయటం జరిగింది. రాష్ట్ర రాజకీయాల్లో స్థిరత్వం కోసం, అనుభవజ్ఞెలైన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని భావితరాల భవిష్యత్తు కోసం జనసేన, టీడీపీ సమన్వయంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికీ, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరి సంక్షేమానికీ తెలుగుదేశం, జనసేన పొత్తు దోహదం చేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని ఈ సమావేశం హామీ ఇస్తుంది.
తీర్మానం 3:
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన లేదు. చట్టం, నిబంధనలు, ప్రజా క్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేవి కనిపించడం లేదు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టిన ఈ పాలనలో అవినీతి, అధికార దుర్వినియోగం, అరాచకం, అక్రమ అరెస్టులు, రాజకీయ కక్ష సాధింపులు, సామాన్యులపై వేధింపులు మాత్రమే ఉన్నాయి. వైసీపీ పాలనంతా ప్రజలకు పీడగా మిగిలింది. పాలసీ టెర్రరిజంతో రాష్ట్రాన్ని వైసీపీ అస్తవ్యస్తం చేసింది. పీపీఏల రద్దు, మద్యం, మైనింగ్‌, ఇసుకలో దోపిడి, భూకబ్జాలు వంటివాటితో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైసీపీ గ్రహణం నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విముక్తం చేసే దిశగా తెలుగుదేశం, జనసేన ఐక్యంగా… అకుంఠిత దీక్షతో ఈ దసరా నుంచి ముందుకు వెళ్తుంది. రైతులను, మహిళలను కార్మికులను, ఉద్యోగులను, నిరుద్యోగులను, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ… ఇలా ప్రతి వర్గాన్నీ వంచించి అబద్ధపు పాలన సాగిస్తున్న వైసీపీ పాలనలోని వైఫల్యాలను, చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియచెబుతాం. రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక స్థితిని జగన్‌ రెడ్డి ఎంతగా దిగజార్చాడో వివరిస్తాం. పథకాల లబ్ధిని అందించడంలో చేస్తున్న వంచనను విడమరచి చెబుతాం. అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పాలనలోనే సాధ్యమైంది. గతంలో కూడా తెలుగుదేశం 13 జిల్లాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధానంతో ముందుకు వెళ్లడం జరుగుతుంది. అమరావతికి వచ్చిన ఇబ్బందులు కూడా సమసిపోతాయి. పోలవరం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయటం, అనుభవజ్ఞులైన, స్థిరమైన నాయకత్వంతోనే సాధ్యమని టీడీపీ, జనసేన బలంగా అభిప్రాయపడుతున్నాయి. బడుగు బలహీన వర్గాలు, పేదల సంక్షేమం… రాష్ట్ర అభ్యున్నతి… పారిశ్రామిక పురోగతి… యువత భవిష్యత్తు… ఆడపడుచుల రక్షణ…. శాంతిభద్రతల పరిరక్షణ… రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, కార్మికుల భవిష్యత్తుకు తెలుగుదేశం, జనసేన కూటమి కట్టుబడి ఉందని తీర్మానం చేస్తున్నాం. ఈ కూటమి ద్వారా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి, ప్రతి కుటుంబానికి కొత్త వెలుగులు తీసుకువస్తామని విజయదశమి పర్వదినాన హామీ ఇస్తున్నాం.