సాగర్ సమరం షురూ – నేటి నుంచే నామినేషన్లు
తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికకకు ఎన్నికల కమిషన్ నేడు నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. అలాగే నేటి నుంచే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనుంది. ఈ నెల 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 31న నామినేషన్లను పరిశీలించనుంది. ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల విత్డ్రాకు అవకాశం కల్పించారు. నిడమనూరు తహసీల్దార్ కార్యాలయంలో సాగర్ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరిస్తారు. కరోనా కారణంగా నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో పాటు ఒక్కరినే అనుమతి ఇస్తారు
నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా.. ఇంకా అధికార టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించలేదు. ఒక్క కాంగ్రెస్ మాత్రమే జానారెడ్డి పేరును ఖరారు చేసింది. కాగా టీఆర్ఎస్ అధిష్టానం దివంగత నేత నోముల కుమారుడు భగత్కే ఇవ్వాలని భావిస్తోంది.
నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,19,745 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,08,907 మంది పురుషులు ఉండగా.. 1,10,838 మంది మహిళలు ఉన్నారు.