వచ్చే నెల 9న రాజకీయ పార్టీని ప్రకటించనున్న షర్మిల!

తెలంగాణ రాజకీయ యవనికపైకి మరో కొత్తపార్టీ రాబోతోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ఇది వరకే ప్రకటించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల ఉమ్మడి జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు.

ఈ ఆత్మీయ సమావేశాలు ముగిసిన తర్వాత ఏప్రిల్ 9న పార్టీ ప్రకటిస్తారని ఆమె అనుచరుడు తూడి దేవేందర్‌రెడ్డి తెలిపారు. పార్టీ విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి వాటిని కూడా ఆ రోజు వెల్లడిస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు.

షర్మిల నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అభిమానులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా అక్కడి సమస్యలు, తాగు, సాగునీరు వంటి సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. వచ్చే నెల 9న ఖమ్మంలో చివరి ఆత్మీయ సమావేశం ఉంటుంది. అదే రోజున పార్టీని ప్రకటించే అవకాశం ఉందని దేవేందర్‌రెడ్డి తెలిపారు.