నిస్వార్ధ రాజకీయ నాయకుడు శ్రీ కొణిజేటి రోశయ్య

• జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
నిస్వార్ధ రాజకీయాలు చేసిన ఆదర్శవంతమైన నాయకుడు దివంగత కొణిజేటి రోశయ్య గారు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కొనియాడారు. శ్రీ రోశయ్య గారి సేవలు తెనాలి ప్రాంతవాసులకు గుర్తుండిపోతాయన్నారు. ఎన్ని పదవులు అలంకరించినా అందరితో కలుపుగోలుగా ఉండేవారని, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. తెనాలి పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్ కీ. శే. రోశయ్య గారి కాంస్య విగ్రహానికి సోమవారం సాయంత్రం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ రోశయ్య గారితో ఉన్న అనుబంధాన్ని, తెనాలి ప్రాంతానికి చేసిన సేవలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, తెనాలి వైశ్య సంఘం పెద్దలు నూకల వేణుగోపాల్, నంబూరి కృష్ణమూర్తి, సాధు ప్రతాప్, మద్దు నాగేశ్వరరావు, కోట పున్నారావు తదితరులు పాల్గొన్నారు.