19న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర

* పర్చూరు ఎస్.కె.పి.ఆర్. డిగ్రీ కళాశాల వేదికగా రచ్చబండ
జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా ఆదివారం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారు. సాగు భారమై బలవన్మరణానికి పాల్పడిన 80 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందచేస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లా మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించే ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉదయం 11 గంటలకు ఏటుకూరు చేరుకుంటారు. అక్కడి నుంచి 11గం. 30నిమిషాలకు చిలకలూరిపేట వస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజుపాలెం కూడలికి చేరుతారు. అక్కడి నుంచి దేగర్లమూడి, చింతపల్లిపాడు, యనమదల, యద్దనపూడి, పెద్ద జాగర్లమూడి మీదుగా పర్చూరు చేరుకుంటారు. రోడ్డు మార్గం మధ్యలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నాం 3 గంటలకు పర్చూరులోని ఎస్. కె. పి. ఆర్. డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగే రచ్చబండ సభా వేదికగా రైతు కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అనంతరం రచ్చబండ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు.