జాతీయ గీతాన్ని ఆలపిస్తూ కంటతడి పెట్టుకున్న సిరాజ్..

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టు ప్రారంభానికి ముందు హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో ఇరు జట్లు తమ జాతీయ గీతాలను ఆలపించడం ఆనవాయితీ.

భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న క్రమంలో సిరాజ్ కన్నీరు పెట్టుకున్నాడు. ఉబికి వస్తున్న కన్నీటిని నియంత్రించుకోలేకపోయాడు. చెక్కిళ్లపై నుంచి నీళ్లు కారడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. చెంపలపై కన్నీటిని రెండు చేతులతో తుడుచుకోవడం ప్రత్యక్ష ప్రసారంలో కనిపించింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈ వీడియోను ట్వీట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ తొలి వికెట్ తీసి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. ఐదు పరుగులు చేసిన ప్రమాదకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్ పంపించాడు.