జులై 17న తిరుపతికి శ్రీ పవన్ కళ్యాణ్

• శ్రీ కొట్టే సాయిపై శ్రీకాళహస్తి సీఐ దాడి ఘటనపై జిల్లా ఎస్పీకి వినతిపత్రం
శ్రీకాళహస్తిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జనసేన నాయకుడు కొట్టే సాయిపై అమానుషంగా దాడి చేసిన సీఐ శ్రీమతి అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలంటూ సోమవారం ఉదయం తిరుపతి జిల్లా ఎస్పీకి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినతిపత్రం సమర్పిస్తారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జిల్లా ఎస్పీ ద్వారా రాష్ట్ర డీజీపీ దృష్టికీ ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. శనివారం మధ్యాహ్నం ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం 9గం. 30ని.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. 10గం. 30ని.లకు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందిస్తారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని శాంతియుత, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.