సింహ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు సింహ వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో వాహన సేవ జరుగుతున్నది.

మధ్యాహ్నం ఒంటిగంటకు ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనసేవ నిర్వహిస్తారు. కరోనా కారణంగా ఆలయంలో ఏకాంతంగా ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.

సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో ఆ శక్తులన్నీ చైతన్యవంత‌మ‌వుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజ‌య‌స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహం సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు.