వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు వేదనలు.. వెతలే

• జనసేన ప్రభుత్వంలో ప్రజలందరికీ ఉపయోగపడే నిర్ణయాలు
• ప్రజలే అంతిమ నిర్ణేతలు
• కార్మికులు,కర్షక, చేతివృత్తుల వారితో సమావేశమైన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
వింటే తెలుస్తుంది ప్రజల వేదనలు… గుండెను తాకే వెతలు. వైసీపీ పాలన మొదలయ్యాక కష్ట జీవులు, కర్షకులు, వ్యాపారులు… ప్రతి వర్గం ఆరి బాధలకు అంతుపొంతు లేకుండా ఉంది. జనసేన వారాహి విజయ యాత్రలో భాగంగా శుక్రవారం గొల్లప్రోలులో కార్మికులు, కర్షకులు, చేతి వృత్తులవారు, వ్యాపారులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలను విని, స్వయంగా నోట్ చేసుకున్నారు. అన్నీ రంగాలకు వైసీపీ పాలనలో తీరని నష్టం జరుగుతోందని, సంక్షేమం 

ముసుగు వేసి అన్నీ రంగాలను డొల్ల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు, నిధులు.. అన్నీ ఆగిపోయాయని వాపోయారు. ఒక్కొక్కరితో మాట్లాడి అందరి బాధలను శ్రీ పవన్ కళ్యాణ్ విన్నారు.
రాపర్తికి చెందిన శ్రీ ముప్పిడి అమరనారాయణ రెడ్డి అనే రైతు తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలిపారు. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు నిజమైన రైతులకు అందటం లేదని వాపోయారు. కోత మిషన్లను సైతం పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకోవడం వల్ల ఖర్చు పెరుగుతోందన్నారు. హేచరీలను నిర్వహించే వ్యాపారులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. విద్యుత్ కోతలతోపాటు, విద్యుత్ సరఫరాలో తరచూ ఎదురయ్యే అవాంతరాలను శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. భవన నిర్మాణ రంగంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రీ తోటకూర శివసత్యనారాయణ తెలిపారు. దుర్గాడకు చెందిన శ్రీ వెలుగుల లక్ష్మణ్, శ్రీ గొల్లపల్లి శివబాబు అనే రైతులు పొట్టి మిర్చి రకం వేసిన రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని వాపోయారు. ఇతర ప్రాంతాలకు వెళ్ళి భూములు కౌలుకు తీసుకొని బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు వేసిన శ్రమ మాత్రమే మిగులుతుందన్నారు. ఉప్పాడకు చెందిన శ్రీ పలివెల నానిబాబు అనే యువకుడు మాట్లాడుతూ చేపలు విక్రయించేవారికి అవసరమయ్యే తాటాకు బుట్టల్లాంటివి చేసుకొని జీవిస్తామని, ఈ వృత్తిలో ఉన్నవారికి ఎలాంటి ప్రోత్సాహకాలు, రుణాలు రావడం లేదన్నారు. చేబ్రోలుకు చెంది శ్రీ జయకృష్ణ అనే యువకుడు గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రక్రియ పెట్టడం ఎదురవుతున్న ఇక్కట్లను, సర్వేలో కొలతలు తేడా వస్తున్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘జనసేన ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు చేసే పాలసీలు ఉంటాయి. అందరితో మాట్లాడి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను విన్న తర్వాత అందరికీ అవసరమయ్యే నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతి రంగంలోనూ సమస్యలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అందరి జీవితాలు నాశనం అయ్యాయి. సంక్షేమం ఆశ చూసి, ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ పునర్వైభవం సాధించే దిశగా జనసేన ప్రభుత్వంలో పాలన ఉంటుంది. కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా ప్రజల జీవితాలు బాగు పడే నిర్ణయాలుంటాయి. మా ప్రభుత్వంలో ప్రజలే అంతి నిర్ణేతలు అవుతారు’’ అని భరోసా ఇచ్చారు.