ప్రతిపక్షాల గొంతు నొక్కడమే వైసీపీ లక్ష్యం

* వ్యక్తిగత కక్ష సాధింపులో భాగంగానే శ్రీ చంద్రబాబునాయుడు అరెస్ట్
* గతంలో విశాఖలో శ్రీ పవన్ కళ్యాణ్ ని పోలీసులు అక్రమంగా నిర్బంధించారు
* ప్రజాస్వామ్యవాదులంతా రాష్టంలో జరుగుతున్న అరాచక పాలనను ఖండించాలి
* తెనాలి మీడియా సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ పని తీరుతో రాష్ట్రాన్ని నెగిటివ్ గ్రోత్లోకి నెట్టేశారు. ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని అరెస్టు చేయించార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం రిజిస్టర్ అయిన ఎఫ్ ఐ ఆర్ పేరుతో శ్రీ చంద్రబాబు గారిని అరెస్టు చేయడం వైసీపీ ప్రభుత్వ కక్షపూరిత వ్యవహార శైలికి పరాకాష్టగా నిలుస్తుందని చెప్పారు. ప్రజా సమస్యలపై స్పందించి, మాట్లాడే విపక్షాల గొంతు నొక్కేందుకు మొదటి నుంచి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, పాలనా వ్యవస్థలను వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటుందని తెలిపారు. తెనాలిలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “దేశంలో జీ 20 సదస్సు వైభవంగా జరుగుతుంటే రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు ఎలా తీసుకొని రావాలి… పరిశ్రమలు ఎలా రప్పించాలి అని ఆలోచించాల్సిన ప్రభుత్వం.. విపక్షాలపై అడ్డగోలుగా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టినప్పుడు కూడా పోలీసులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో పాటు మా పార్టీ నాయకులను అక్రమంగా నిర్బంధించారు. ప్రజలను కలుసుకోనివ్వకుండా చేసి అక్రమంగా హత్యాయత్నం కేసులను మా పార్టీ నాయకులు పై మోపారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వ్యక్తిగతంగా కక్ష తీర్చుకునేందుకు మూడు, నాలుగు నెలల నుంచి ప్రయత్నం జరుగుతోంది. ఏదో విధంగా కేసులు పెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. చట్టపరమైన ప్రొసీజర్ కు వ్యతిరేకంగా పోలీసులు ప్రవర్తించడం సరికాదు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లకుండా కావాలనే ఈ ప్రభుత్వం బెదిరింపులకు గురి చేస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏ పార్టీ కూడా పోటీకి ఉండకూడదు అనేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం వారి వ్యవహార శైలిని తెలియపరుస్తోంది. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్య వాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉంది.
* మంగళగిరిలో ప్రత్యేక సమావేశం
రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన, ప్రతిపక్షాలపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలపై ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన పార్టీ పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను జనసేన పార్టీ ఎలా ఎదుర్కోవాలి.. ప్రస్తుత రాజకీయ సంక్షోభంలో పార్టీ తీసుకోవలసిన స్టాండ్ పై శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకులకు దిశా నిర్దేశం చేస్తారు. 14 సంవత్సరాలు పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు ప్రభుత్వం బాధ్యత వహించాలి” అన్నారు.