ముఖ్యమంత్రి గత చరిత్ర ఏమిటో తెలుసు… ఆయన కాండక్ట్ సర్టిఫికెట్ జనసేనకు అవసరం లేదు!

* ప్రజలకు మేలు చేయడమే జనసేన పార్టీకి తెలుసు
* సీఎం సభకు వచ్చిన మహిళల చున్నీలు తీయించడం అత్యంత దురదృష్టం
* మహిళలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
* ఈ ప్రభుత్వ పాలన మీద ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు
* విశాఖ విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

‘రాష్ట్ర ముఖ్యమంత్రి నేపథ్యం ఏమిటో.. గత చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి పదవి ఆయనకు ముసుగులా ఉంది. ఈ ముఖ్యమంత్రి చేసిన ఘనకార్యాలూ ప్రజలకు తెలుసు. ప్రజల పక్షాన నిత్యం పోరాడుతున్న వారికి అవసరం అయ్యే పనులు చేస్తున్న జనసేన పార్టీకి సీఎం కాండక్ట్ సర్టిఫికెట్ ఏమి అక్కర్లేద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నియోజకవర్గ సమీక్షల కోసం మంగళవారం విశాఖపట్నం విమానాశ్రయానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ మీద నోటికి వచ్చినట్లు ఈ ముఖ్యమంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. సొంత నియోజకవర్గం పులివెందులలోనూ పరదాలు కట్టుకోకుండా పర్యటించలేని ఈ సీఎం కూడా మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల కష్టంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడి వారి కోసం పోరాటం చేశాం.. డొక్కా సీతమ్మ ఆహార కేంద్రాల పేరుతో భోజనం అందించాం.. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలబడ్డాం.. అలాంటి మా పార్టీ పట్ల ముఖ్యమంత్రి దిగజారుడు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తున్నాయి. ప్రజలతో, ప్రజల కోసం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ప్రజలకు కనిపించకుండా, పరదాలు కట్టుకొని, బారికేడ్లు పెట్టుకొని, దుకాణాలు మూయించి వేసి మరీ పర్యటనలకు రావడం ఎక్కడా చూడని వింత చర్య. స్కూళ్ళు, కాలేజీలు మూయిస్తున్నారు. ప్రజలను దగ్గరికి రానివ్వకుండా పరిపాలించడం ఈ ముఖ్యమంత్రికే చెల్లుబాటు. అలాంటి వ్యక్తి జనసేన పార్టీకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.
* మహిళలను అవమానించడానికి కారకుడు సీఎం
వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ బహిరంగ సభలు పెట్టుకొని అదే ప్రభుత్వ గొప్పతనంగా ఈ ముఖ్యమంత్రి భ్రమపడుతున్నారు. సభకు తీసుకువచ్చిన మహిళలను చున్నీలను సైతం బయటపెట్టి రమ్మనడం అత్యంత దురదృష్టం. ఈ చర్యలు కచ్చితంగా వారిని అవమానించడమే. సభకు మహిళలను బలవంతంగా తీసుకువచ్చి, బహిరంగంగా అవమానపర్చిన ఈ ముఖ్యమంత్రి మహిళలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలి. చున్నీలు తీసేయాలి, పెన్నులు పడేయాలి అంటూ నిబంధనలు చెబుతున్న పోలీసులను ఏమి అనగలం. వారితో ఆ విధంగా వ్యవహరింప చేస్తున్నది ఈ ముఖ్యమంత్రే. వ్యవస్థలను వాడుకుంటూ ప్రజలను మభ్యపడుతూ పాలన చేస్తున్న ఈ ముఖ్యమంత్రి పాలన మీద ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో సీఎం సభలో పెన్నులు నిషేధించిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు మహిళలను కించపరుస్తూ చున్నీలు కూడా వద్దని చెప్పడం దారుణం.
* ప్రజలంటే భయం
ప్రభుత్వ కార్యక్రమాల్లో విపక్షాలపై ఇష్టానుసారం విమర్శలు చేయకూడదని, నోరు పారేసుకోకూడదనే ఇంగిత జ్ఞానం ఈ ముఖ్యమంత్రి కి లేదు. ప్రజాధనంతో బహిరంగ సభలు పెట్టి రాజకీయ విమర్శలు చేయడం ఈయనకే చెల్లింది. దీనిలో పోలీసుల తప్పు ఉందని మేము భావించడం లేదు. పైనుంచి వచ్చిన ఆదేశాల్ని వారు పాటిస్తారు. కచ్చితంగా దీనిపై ప్రభుత్వ పెద్దలు మహిళలకు క్షమాపణలు చెప్పాలి. ఈ ముఖ్యమంత్రికి ప్రజలంటే భయం.
* వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం వేచి చూస్తున్నారు
విజయనగరం జిల్లాలోని సమస్యలపై, క్షేత్రస్థాయి పరిస్థితులపై, అధికార పార్టీ నేతల అవినీతిపై పూర్తిస్థాయిలో చర్చించేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు వారం రోజుల పాటు సమావేశాలు ఉంటాయి. విజయనగరం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల పరిస్థితులను ఈ సందర్బంగా సవివరంగా చర్చిస్తాం. ఈ ప్రభుత్వ పాలన మీద ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అసమర్థత, అవినీతితో కూరుకుపోయిన ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీని బలోపేతం చేసేలా, ప్రజా సమస్యలపై పోరాడేలా పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తాం. అధికార పార్టీ అరాచకాలకు అన్యాయాలకు ప్రజలు భయపడుతున్నారు. కచ్చితంగా ఎన్నికల్లో మాత్రం ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారు” అన్నారు.
* శ్రీ మనోహర్ కి ఘన స్వాగతం పలికిన విశాఖ నేతలు
ఉత్తరాంధ్ర పర్యటనకు విచ్చేసిన జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు విశాఖపట్నం విమానాశ్రయంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నేతలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు పూలమాలలు, బొకేలతో స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు. స్వాగతం పలికిన వారిలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కోన తాతారావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కరరావు, పార్టీ నాయకులు సందీప్ పంచకర్ల, శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్, పీవీఎస్ఎన్ రాజు, గడసాల అప్పారావు, శ్రీమతి ఎ.దుర్గా ప్రశాంతి, డా.రఘు, డా. మూగి శ్రీనివాస్, పీతల మూర్తి యాదవ్, గంగులయ్య, దల్లి గోవింద్, శ్రీమతి రేవతి, జి.అప్పలస్వామి తదితరులు ఉన్నారు.