రాష్ట్రంలో అత్యంత దయనీయంగా రహదారుల పరిస్థితి
- రోడ్ల దుస్థితి చూస్తే రాష్ట్ర అభివృద్ది తెలిసిపోతుంది
- కనుమరుగైన గ్రామీణ రోడ్లు
- జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట: ఐదేళ్ల జగన్ పరిపాలనలో రాష్ట్రంలో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా తయారైందని, రాష్ట్రం అభివృద్ధికి కృషి చేస్తున్నా.. అని మాయమాటలు చెప్పే జగన్ ఆయన చేసిన అభివృద్ధి ఏంటో ఏ రోడ్డును చూసినా ఇట్టే తెలుస్తుందని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి చెప్పారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ ఏళ్ల తరబడి నిర్వహణ లేక కొన్ని గ్రామాల్లో రోడ్లు కనుమరుగయ్యాయని,. కొన్ని గ్రామాల్లో లింక్రోడ్లు తారు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని ఆరోపించారు.. దీంతోకొన్ని వందల గ్రామాలకు బస్సులు నడపలేక సర్వీసులను నిలిపేశారని. ఆ గ్రామాలకు ఆటోల్లోనేప్రయాణం సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు. ఆర్అండ్బీ శాఖ ఉన్న గుంతల రోడ్ల మరమ్మతులకు, కొత్త రోడ్లు వేయడానికి ప్రభుత్వానికి ఏటా అంచనా వ్యయం పంపుతున్నా. కానీ నిధులు మంజూరు కావడం లేదని, కాంట్రాక్టులు సైతం ముందుకు రావటం లేదన్నారు. రోడ్ల దుస్థితిపై మొదటిగా పోరాటం చేసింది జనసేనే. రాష్ట్రంలో రోడ్లను మరమత్తులు చేయాలని మొదటిసారిగా ఉద్యమ రూపంలో పోరాటం చేసింది జనసేన పార్టీయే అని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రంలో మరమత్తులకు గురైన ప్రతి రోడ్డు వద్ద ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. దీని వల్ల కొంతమేర ప్రభుత్వం రోడ్ల మరమత్తులను ప్రారంభించిందన్నారు. రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రతి రోజు ఆధ్వాన్న రోడ్లపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఎంతో మంది గాయపడటం, మృత్యువాత పడటానికి రోడ్ల దుస్థితే కారణమన్నారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, పెద్ద పెద్ద గోతులు పడి, రాళ్లు తేలిన రోడ్ల మీద ప్రయాణించలేక ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల నేతలు సైతం మన రోడ్ల గురించి ఎద్దేవా చేసే స్థాయికి పరిస్థితి చేరిందని తెలిపారు.