సంక్షేమం ముసుగులో అభివృద్ధిని మరిచారు

• స్థానిక సంస్థల నిధులు దోచి అర్థిక సంక్షోభం సృష్టించారు
• సేవ చేయొచ్చన్న ధైర్యాన్ని సర్పంచులకు దూరం చేశారు
• తెనాలిలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వం సంక్షేమం అనే పేరుతో ఒక ముసుగు వేసుకొని అభివృద్ధి కార్యక్రమాలను పక్కన పెట్టేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంఛార్జ్ శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో ఉన్న నిధుల్ని కూడా దోచేసి సర్పంచ్ లకు అభివృద్ధిపై దృష్టి సారించే అవకాశం లేకుండా చేశారన్నారు. గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సౌకర్యాలను కూడా రానివ్వకుండా చేసి శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర అర్థిక సంక్షోభం సృష్టించిందని తెలిపారు. సోమవారం ఉదయం గుంటూరు జిల్లా, తెనాలిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “ఈ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టింది. గతంలో మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు ఉండేది. ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్ లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలకు ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడతామన్న ధైర్యం ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం ఉన్న చెక్ పవర్ తీసేసింది. నిధులు దుర్వినియోగం చేస్తోంది. 15వ అర్థిక సంఘం నిధులు తిరిగి ప్రభుత్వ ఖజానాకు తీసుకుపోయింది. ఈ పరిస్థితిని జనసేన పార్టీ ఖండిస్తోంది. భవిష్యత్తులో గ్రామ స్థాయిలో అనేక కార్యక్రమాల గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. తెనాలి పట్టణంలో చూస్తే నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడం స్పష్టంగా కనబడుతోంది. గ్రామ స్థాయిలో పూర్తిగా తమ పార్టీకి ఉపయోగపడే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించిన సమాచారం ఏ మాత్రం ప్రభుత్వం వద్ద లేదు. నూతన సంవత్సరం వేళ ఈ పరిస్థితులు తొలగిపోయి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఈ ప్రాంతం వృద్ధి చెందాలనీ, ప్రతి కుటుంబం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రజా ప్రతినిధులుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలు రాష్ట్రానికీ, దేశానికి ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్లాలని, అంకితభావంతో పనిచేయాలని కోరుకుంటున్నామ”న్నారు.

  • క్రియాశీలక సభ్యుడికి భీమా ధీమ

జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రమాద భీమా సౌకర్యాన్ని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కల్పించారని శ్రీ మనోహర్ చెప్పారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి 5 లక్షల రూపాయలు భీమా అందేలా ఈ పథకం ఉంటుంది. గాయపడిన వారికి వైద్య ఖర్చులు అందుతాయి. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గానికి చెందిన శ్రీ పెదమల్లు వెంకట నారాయణ ప్రమాదంలో గాయపడ్డారు. ఆయనకు రూ.28,815 భీమా మొత్తం చెక్కును శ్రీ నాదెండ్ల మనోహర్ అందచేశారు.