తెలుగు రాష్ట్రాల యువత భవిష్యత్తు బంగారం కావాలి

* పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు
* బీసీ వర్గాలకు రాజ్యాధికారం అవసరం
* దుబ్బాక ఎన్నికల ప్రచార సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘నేను ఏనాడూ పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. అధికారం కోసం అర్రులు చాచలేదు. అధికారం, పదవులు మాత్రమే ఆఖరి లక్ష్యం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాజకీయాలు చేసుకునేవాడిని. అక్కడే ఉండిపోయేవాడిని. నా ఆలోచన రెండు తెలుగు రాష్ట్రాల యువత బంగారు భవిష్యత్తు. పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్ర కలలు, ఆకాంక్షల సాకారం మాత్రమే. దీని కోసం మాత్రమే నేను తుదివరకూ రాజకీయాలు చేస్తాను. తెలంగాణ సంపూర్ణ ఎదుగుదలకు జనసేన సహకారం పూర్తి స్థాయిలో ఉంటుంది’ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన- బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ దుబ్బాకలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో గురువారం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తెలంగాణ యువత అంటే పోరాటానికి నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ యువతలో అమితమైన శక్తి ఉంది. తెగింపు ఉంది. తమ ప్రాంతానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే యువత కాదు. తిరగబడి సాధించుకుంటారు. వారి పోరాట స్ఫూర్తి నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించింది. దశాబ్దాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యింది. ఇక ప్రగతి బాటలో రాష్ట్రం ముందుకు సాగాలి. ఇక్కడి ప్రజలు దేనికోసం పోరాడారో వారి ఆకాంక్షలన్నీ తీరాలి. వెలుగులీనే తెలంగాణ రావాలి. సమష్టిగా దీని కోసం ప్రతి ఒక్కరూ కష్టపడదాం. పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని ప్రగతి దశలో నిలిపేందుకు సుస్థిరమైన పరిపాలనకు, అన్ని విధాలుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరుద్దాం. కచ్చితంగా తెలంగాణ ఆకాంక్షలను భారతీయ జనతా పార్టీ నాయకత్వం తీరుస్తుంది అని నేను విశ్వసిస్తున్నాను.
* అప్పుడే మార్పు సాధ్యం
అధికారం ఏ ఒక్కరి సొత్తూ కాదు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు అధికారం దగ్గర కావాలి. తెలంగాణ సాధించుకున్నప్పుడు దళితుడు ముఖ్యమంత్రి అవుతాడని అంతా అనుకున్నాం. అంతా సంతోషించాం. ఆ కల నెరవేరలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కచ్చితంగా బీసీ వర్గాల నుంచి ముఖ్యమంత్రిని చేస్తామన్న మాటకు తెలంగాణ ప్రజానీకం అంతా మద్దతుగా నిలవాలి. అధికారం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. కచ్చితంగా అది అందరికీ అందాలి. అప్పుడే సమాజంలో సంపూర్ణ మార్పు సాధ్యం. సమాజంలోని అన్ని వర్గాలు అభ్యున్నతి పథంలో నడిస్తేనే ఆ సమాజం మెరుగ్గా మారుతుంది. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లోను సోదరులు శ్రీ రఘునందన్ రావు ఇక్కడి ప్రజానీకానికి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్న సోదరులు శ్రీ రఘునందన్ రావు గారికి వచ్చే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలిపిస్తే శాసనసభలో నియోజకవర్గం నుంచి మంచి ప్రాతినిధ్యం లభిస్తుంది. ఏ విషయాన్ని అయినా పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని, మాట్లాడే శ్రీ రఘునందన్ రావు లాంటి నాయకుల అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వారిని గెలిపించుకోవాలి. తెలంగాణలో బీజేపీతో కలిసి జనసేన చేస్తున్న రాజకీయ ప్రయాణంలో అన్ని వర్గాలకు న్యాయం జరగాలన్నదే తుది ఆశయం. దీనికి చివరి వరకు కట్టుబడి పని చేస్తాం. తెలంగాణలోని పల్లెలు పట్టణాలు పూర్తి స్థాయిలో సుందరంగా తయారయ్యేలా, తెలంగాణ ప్రజలందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేలా చూడాలి అన్నదే లక్ష్యం. దీనికోసం రాజకీయంగా ఉన్నత ఆలోచనతో తెలంగాణ యువత వచ్చే ఎన్నికల్లో బిజెపి జనసేన పార్టీలకు మద్దతుగా నిలవాలి” అన్నారు. ఈ సభలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, దుబ్బాక నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.