రాష్ట్ర ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ పూర్తి మద్దతు

*నెల్లూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్

నెల్లూరు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు జనసేనపార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. అధికారం చేపట్టిన వారంలోనే సిపిఎస్ రద్దు ఏమైంది?? తప్పుడు లెక్కలతో లెక్కలు నేర్పించే ఉపాధ్యాయులకే దొంగ లెక్కలతో అడ్డంగా దొరికిన ఇంకా మసిపూసి మారేడుకాయ చెయ్యాలనుకోవడం అనేది జరిగేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఉద్యోగులు రోడ్లపైకి వచ్చారని, విజయవాడలో గురువారం ఉద్యోగులు,ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన తో ఐనా వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్చలు జరపాలని కోరారు. ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు, సొంత లాభం కోసం జగన్ మెహన్ రెడ్డి జిల్లాల విభజన చేయడం జరిగిందని, ఇలా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గూడూరు నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపడం వల్ల జిల్లా కేంద్రం ఐన తిరుపతికి సుమారు 100 కి.మీ వెళ్లాలంటే ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. కాబట్టి గూడూరును శ్రీ బాలాజీ జిల్లాల్లో కలపకుండా, నెల్లూరు జిల్లాలోని కొనసాగించాలి లేకపోతే పాత గూడూరు డివిజన్ లోని అన్ని నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ నాయకులు మోహన్, రాజశేఖర్, కోటి, శివ, సాయి, సంతోష్, శంకర్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.