జనసేన గెలుపులో ప్రవాసుల పాత్ర కీలకం
• రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ విజయానికి అవిరళ కృషి చేయండి
• యూఎస్ జన సైనికులతో టెలికాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు
2024 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి, జనసేన పార్టీకి చాలా కీలకమని, ప్రవాసాంధ్రులంతా పార్టీ గెలుపునకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు కోరారు. అవకాశం ఉన్న ప్రతి ఎన్ఆర్ఐ జన సైనికుడు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ గెలుపు కోసం అండగా ఉండాలని పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం యూఎస్ కు చెందిన ప్రవాసాంధ్రులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో పని చేసే అంశంపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “సార్వత్రిక ఎన్నికల్లో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకం. ఎన్ఆర్ఐ జన సైనికులంతా పార్టీ గెలుపు కోసం పనిచేయాలి. తటస్థ ఓటర్లను పార్టీ వైపు మలచడంతోపాటు… పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని, మన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు విశాల దృక్పథంతో తీసుకున్న నిర్ణయాలను సామాన్యులకు అర్థం అయ్యేలా చేసే బాధ్యత తీసుకోవాలి. గత ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన రాజోలు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకొని పార్టీ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో విజయమే లక్ష్యంగా పని చేద్దాం. ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నవారు తప్పకుండా స్వదేశానికి వచ్చి పార్టీ కోసం పనిచేయండి. రావటానికి అవకాశం లేనివారు అక్కడి నుంచే పార్టీ గెలుపునకు కృషి చేయండి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులను సమాయత్తపరచేందుకు త్వరలో యూఎస్ లో పర్యటిస్తాను” అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శ్రీ శశిధర్ కొలికొండ సమన్వయం చేశారు.