ఆటోడ్రైవర్ల సేవలు ప్రశంసనీయం

@సిద్ధివినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ సంక్రాంతి సంబరాలు

రాజమహేంద్రవరం, స్థానిక గోదావరి గట్టున ఉన్న రజక సేవా సంఘం కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ సిద్ధి వినాయక ప్యాసింజర్ ఆటో యూనియన్ సురేష్ నాయుడు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి సంబరాల మహోత్సవానికి జనసేన పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు వై.శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, జనసేన పార్టీ అర్బన్ నియోజకవర్గ ఇన్చార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్, ఆటో యూనియన్ నాయకుడు బాక్స్ ప్రసాద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వై.శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు నీతికి, నిజాయితీకి నిదర్శనమని కొనియాడారు. నిత్యం ప్రయాణీకులను క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేర్చుతూ కష్టపడే మనస్తత్వం కలిగిన వారని ఎంతో మంది గర్భిణులకు ఉచితంగా సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఆటోలో కూతురి వివాహానికి ఓ తండ్రి నగదు బ్యాగ్ తీసుకుని వెళుతూ, ఆటోలో మరిచినా నిజాయితీగా జిల్లా ఎస్పీకి అందచేసి తమ గొప్పతనాన్ని చాటుకుంటున్నారని అభినందించారు. ఆటో యూనియన్ సభ్యులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి ఎదగాలని, ఇతర యూనియన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని, ఆటో యూనియన్ సభ్యులకు, వారి కుటుంబాలకు ఎటువంటి సమస్య వచ్చినా జనసేన పార్టీ వెంట ఉంటుందని వై. శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు దాసరి గురునాధరావు, జిల్లా కార్యదర్శులు జామి సత్యనారాణ, తేజోమూర్తుల నరసింహమూర్తి, జిల్లా ముఖ్య నాయకులు రావాడ నాగు (అనపర్తి) తదితరులు పాల్గొన్నారు.