సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనం ఏమిటి?

• ముఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితి వచ్చిందా?
• ఎవరి ఒత్తిడితో ప్రయాణికులను దింపి మరీ వాహనం తీసుకున్నారో స్పష్టత ఇవ్వాలి

ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటిస్తే ప్రయాణీకులను నడిరోడ్డుపై దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకొనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన లాంటివి ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న ట్రావెల్ ఆపరేటర్ల నుంచి వాహనాలు అద్దెకు తీసుకోవడం గురించి విన్నామే తప్ప ప్రయాణంలో ఉన్నామని చెబుతున్నా పట్టించుకోకుండా వాహనం తీసుకొనే పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. బుధవారం రాత్రి ఒంగోలు నగరంలో శ్రీ వేమల శ్రీనివాస్ గారి కుటుంబం తిరుమల వెళ్తుంటే రవాణా శాఖ అధికారులు బలవంతంగా వారి వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం విస్మయానికి గురి చేసింది. సీఎం కాన్వాయ్ కోసం ప్రయాణీకులను నడిరోడ్డున దింపేసి వాహనాలు స్వాధీనం చేసుకోవల్సిన పరిస్థితి ఎందుకు కలిగింది? రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ కలిగి… రూ.7.77లక్షల కోట్లు అప్పు తెచ్చుకొన్న సామర్థ్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పర్యటనకు ప్రైవేట్ వ్యక్తుల వాహనాలు తీసుకోవడం ఏమిటి? ముఖ్యమంత్రి భద్రత పర్యవేక్షించే అధికారులు కాన్వాయ్ లో ప్రైవేట్ వాహనాలు అనుమతిస్తున్నారా… అనుమతిస్తే ఏ ప్రాతిపదికన ఆ వాహనాలు తీసుకొంటున్నారో వివరించాలి. లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ప్రభుత్వం సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేని పరిస్థితిలో ఉందా అనే సందేహాలు నెలకొంటున్నాయి.
• ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాలి
ఒంగోలు ఘటనలో ఒక సహాయ అధికారిని, ఒక హోమ్ గార్డుని సస్పెండ్ చేసేసి విషయాన్ని మరుగున పెట్టేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉంది. ట్రావెల్ ఆపరేటర్స్ నుంచి అద్దెకు తీసుకోకుండా ప్రయాణీకులను నడిరోడ్డుపై వదిలి వాహనాన్ని తీసుకోవాల్సిన ఒత్తిడితో కూడిన పరిస్థితి ఆ ఉద్యోగులకు ఎందుకు కలిగిందో విచారించాలి. సదరు ఉద్యోగులపై ఆ స్థాయి ఒత్తిడిని రాజకీయ నాయకులు తీసుకువచ్చారా? ఉన్నతాధికారులు తీసుకువచ్చారా అనేది ముఖ్యం. పాలన వ్యవస్థలో భాగమైన ఆ ఉద్యోగులు ఎవరి ఒత్తిడితో, ఎవరి వినియోగం కోసం బలవంతంగా వాహనాలు స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారో వెల్లడి కావాలి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఏటా ముఖ్యమంత్రి భద్రతకు ఎంత ఖర్చు చేస్తున్నారు? వాహన శ్రేణిలో ఉండే వాహనాలు ఎన్ని? ముఖ్యమంత్రి పర్యటనలకు ప్రైవేట్ వాహనాలు ఎందుకు స్వాధీనం చేసుకొంటున్నారు? ప్రైవేట్ వాహనాల్లో ఎవరు పర్యటనలు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఒంగోలు ఘటనపై శాఖపరమైన విచారణ చేయాలి అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.