రాజకీయ సన్యాసం ఎప్పుడు…???: స్పీకర్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన పేడాడ

అమలాపురం తప్పిదం ప్రభుత్వానిది కాదా అని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలు ప్రకటించిన నాడే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టలేదు ఎందుకో ప్రభుత్వమే చెప్పాలని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్నారు. అమలాపురంలో విధ్వంసం సృష్టించింది వైసీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ కు బాధ్యత ఉంది కాబట్టే ప్రజలు సంయమనం పాటించాలని ప్రకటన చేశారని గుర్తు చేశారు. ప్రతి జిల్లాను రెండు జిల్లాలుగా చేసిన ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోని పలాస ను ఎందుకు జిల్లాగా చేయకూడదో చెప్పాలని నిలదీశారు. అంబేద్కర్ పలాస జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఎన్నికలలో గెలిచిన రెండు సంవత్సరాలలోపు చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని హామీ ఇచ్చారని లేని పక్షంలో రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారని పదవికి పార్టీకి ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి జడ్పిటిసి అభ్యర్థి  పైడి మురళి మోహన్, ఫణి కుమార్ , విజయ్ కుమార్, రాజశేఖర్, కోటి, అశోక్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.