కేంద్రాన్ని చూస్తే అధికార పార్టీ నేతలకు గుర్తొచ్చేది సాష్టాంగమే

*విశాఖ ఉక్కు సమస్యపై కచ్ఛితంగా మాట్లాడతా: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
అధికార పార్టీ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తాం.. కేంద్రం మీద ఒత్తిడి తెస్తాం.. ప్రత్యేక హోదా సాధిస్తాం లాంటి మాటలు చెబుతారు. ఈ మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ నిజంగా ఆ స్థాయి వ్యక్తుల్ని చూడగానే వైసీపీ నాయకులకు సాష్టాంగం ఒక్కటే గుర్తుకు వస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ దివ్యాంగ ఉద్యోగుల సమస్యలు జనవాణి – జనసేన భరోసా కార్యక్రమం దృష్టికి వచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య ప్రత్యేక భావోద్వేగాలతో కూడుకున్న అంశం మాత్రమే కాదని, చాలా మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. కచ్చితంగా ఈ సమస్య మీద మాట్లాడతానని హామీ ఇచ్చారు.
బెదిరింపులు వైసీపీ నైజం
*దివ్యాంగులను నిర్లక్ష్యం చేయడం తగదు
బెదిరించడం వైసీపీ నైజం అని.. దానికి చిన్నా పెద్దా తేడా ఏమీ ఉండదని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులను నిర్లక్ష్యం చేయవద్దని, వారి సమస్యలకు బాధ్యతగా పరిష్కారం చూపాలని సూచించారు. కోకి రాజశేఖరరెడ్డి అనే దివ్యాంగుడు తనకు రేషన్ కార్డు నిలిపివేసిన విషయాన్ని జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకు వచ్చారు. వైసీపీ వస్తే దివ్యాంగులకు న్యాయం జరుగుతుందని భావించి తన ఓటుతో పాటు 300 మందితో ఓటు వేయించి చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నానని వాపోయారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. దివ్యాంగుల కోసం జనసేన పార్టీ పాలసీ రూపకల్పన సమయంలో కోకి రాజశేఖర్ రెడ్డి సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. 300 మందితో వైసీపీకి ఓటు వేయిస్తే.. అలాంటి వ్యక్తికి రేషన్ కార్డు తీసివేయడం.. సమస్య పదే పదే విన్నవించుకున్నా స్పందించకపోవడం అన్యాయమన్నారు.