తుపాను వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి

* మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మిర్చి రైతుల సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు
‘మిగ్‌జాం తుపాను మిర్చి రైతును నిలువునా ముంచేసింది. ఎకరానికి లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన రైతుకు సగం కూడా వెనక్కి తిరిగొచ్చే పరిస్థితి లేద’ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను దెబ్బకు మిర్చి రైతులు భారీగా నష్టపోయారని, పంట నష్టం ప్రాథమిక అంచనా వేసి తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గ ప్రాంత మిర్చి రైతులు శ్రీ నాగబాబు గారిని కలిశారు. తుపాను వల్ల కలిగిన నష్టాన్ని ఆయనకు వివరించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ “ప్రకృతి విపత్తులు, చీడపీడల వల్ల పంటలు నష్టపోయినప్పుడు కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంతో రైతులకు మేలు జరిగేది. వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్ర పంటల బీమా పథకం కాదని తామే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని గొప్పలు చెప్పి రైతులను నిలువునా ముంచింది. బీమా సొమ్ములు చెల్లించడం తమ వల్ల కాదని చేతులెత్తేసింది. అటు రైతుని బీమా కట్టనివ్వలేదు. ఇటు ప్రభుత్వమూ కట్టలేదు. ఇప్పుడు తుపాను వల్ల మిర్చి రైతులకు సగానికి సగం నష్టం వచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. పంట నష్టపోయిన ప్రతి మిర్చి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరాకు రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం అందించాలి. రైతుని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయి. వచ్చేది ముమ్మాటికి జనసేన- తెలుగుదేశం ప్రభుత్వమే. రైతు రాజులా బతికే రోజులు మళ్లీ తీసుకొస్తామ”ని హామీ ఇచ్చారు.

Avatar