బెంగాల్ రాష్ట్రం మార్పును కోరుతోంది: ప్రధాని మోదీ

బెంగాల్ రాష్ట్రం మార్పును కోరుతోందని ప్రధాని మోదీ అన్నారు. కేంద్ర సంక్షేమ పథకాల అమలును ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. ఈ నెలలో రెండోసారి బెంగాల్ ను సందర్శించిన ఆయన సోమవారం హుగ్లీ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడారు.సీఎం మమతా బెనర్జీని, అధికార తృణమూల్ కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శిస్తూ… ఈ రాష్ట్రం అవినీతిలో కూరుకుపోయిందని, ఇక్కడ అవినీతి నిర్మూలన జరగాలని అన్నారు. ఇన్నేళ్ళుగా బెంగాల్ ను గాలికి వదిలేశారు.. అందుకే ఇప్పుడు ప్రజలు అసలైన మార్పును కోరుతున్నారు అని మోదీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, అధికార పార్టీ అభివృధ్దిని అడ్డుకుంటూ ఈ రాష్ట్రానికి రావలసిన కేంద్ర నిధులకు మోకాలడ్డుతున్నారని, కేంద్రం 1700 కోట్లను మంజూరు చేస్తే ప్రభుత్వం 609 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆయన విమర్శించారు.

రాష్ట్ర ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందని, దాదాపు అన్ని రంగాల్లో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతోందని పేర్కొన్నారు. బెంగాల్ తన సొంత కూతుర్నే కోరుకుంటోందన్న టీఎంసీ నినాదాన్ని ఆయన అపహాస్యం చేశారు. రానున్న ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో చూద్దామని మోదీ వ్యాఖ్యానించారు.