ఎన్నికల వేళ బీహార్ పై ప్రధాని మోదీ వరాల జల్లు

బీహార్ అభివృధ్ది చెందడానికి కేంద్రం అన్ని విధాలా సహాయపడుతుందని ప్రధాని మోదీ హామీ నిచ్చారు. అక్టోబర్-నవంబర్ నెలల్లో ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన… ఈ మధ్యకాలంలో ఈ స్టేట్ పై మరింత ముఖ్యమైన దృష్టి పెట్టారు. బీహార్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సోమవారం రూ. 14,258 కోట్లతో 9 జాతీయ రహదారుల నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసారు. బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాని 45,945 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ ఇంటర్ నెట్ సర్వీసులు కల్పించారు. ఈ ఫైబర్ ఇంటర్ నెట్ సర్వీసులను ప్రధాని సోమవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఈ హైవే ప్రాజెక్టుల వల్ల రాష్ట్రం ముఖ్యంగా రవాణా రంగంలో ఎంతగానో పురోగతి చెందుతుందన్నారు. వ్యవసాయ బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడం రైతులకు ఎంతో ప్రయోజనకరమవుతుందన్నారు. ఈ విధంగా అన్నదాతల రుణం తీర్చుకోగలుగుతున్నామని ఆయన చెప్పారు. ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీసుల కారణంగా ప్రతి గ్రామంలో బ్రాడ్ బ్యాండ్ సేవలను విస్తరించగలుగుతామని మోదీ పేర్కొన్నారు. అటు-వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ కూడా పాల్గొన్నారు.