ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆయనతో కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు నిన్న ఉదయం కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలూ లేనప్పటికీ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యినట్లు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని…వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్ ఉన్నట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. కాగా వెంకయ్యనాయుడు సతీమణి ఉషాకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా తేలినట్లు తెలిపారు. ముందుజాగ్రత్తలో భాగంగా ఆమె కూడా స్వీయ ఐసోలేషన్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు గానీ, కాంటాక్ట్ లో ఉన్నవారు గానీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

వెంకయ్యకు కరోనా పాజిటివ్ రావడంపై ఆయన కుమార్తె దీపా వెంకట్ స్పందించారు. నాన్న ఆరోగ్యం బాగుందని తెలిపారు. వైద్యపరీక్షలు నిర్వహించామని, వైరల్‌ లోడ్‌ చాలా తక్కువగా ఉందని ఆమె చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీపా వెంకట్ వెల్లడించారు.