మార్పు కోసం ప్రయాణంలో క్రమశిక్షణ వీడవద్దు

* జన సైనికులను, వీర మహిళలను రక్షించుకుందాం
* త్వరలోనే పార్టీ క్రమశిక్షణ కమిటీకి శ్రీకారం
* జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

ఒక బలమైన మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చాను.. ఆ మార్పు వచ్చే వరకు నిరంతరం పోరాడుతూనే ఉంటానని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాయకులకు, శ్రేణులకు పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ప్రజా పోరాటాల్లో ముందుకు వెళుతూ పార్టీ పటిష్టత కోసం నాయకులు జనసేన శ్రేణులు ఏం చేయాలన్న దానిని వివరించారు. సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే అధికారం రాసి పెట్టి ఉంది అనేలా పరిస్థితి ఉంది. వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయి. దీనికి కచ్చితంగా ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడాలి. అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం, అధికారం దక్కాలి. ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న కులాలను దగ్గర చేసుకోవాలి. వారికి జనసేన పార్టీ ఉందన్న భరోసా కల్పించాలి. అగ్రవర్ణ కులాలకు చెందిన యువత కచ్చితంగా వెనుకబడిన తరగతుల కులాలకు పెద్దన్నగా వ్యవహరించి వారిని రాజకీయంగా ముందుకు తీసుకురావాలి. రాజకీయ సాధికారతను సాధించాలి. బలంగా పనిచేసే నాయకులను పార్టీలో పని చేసేందుకు ఆహ్వానించాలి. కేవలం ఒక ఎన్నికల కోసం వచ్చే వారిని పక్కన పెట్టండి. మార్పు వచ్చే వరకు బలంగా పార్టీ కోసం పని చేసే వారిని కచ్చితంగా ప్రోత్సహించండి. ఆయా జిల్లాల పరిధిలో ఉన్న జన సైనికులను అధ్యక్షులే గౌరవంగా చూసుకోవాలి. వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చి, పార్టీ కోసం పని చేయించండి. జీరో బడ్జెట్ రాజకీయాల పేరు చెప్పి, తమ తోడుగా వచ్చే జన సైనికులకు కాఫీ, టీ లు కూడా ఇవ్వకుండా చేయకండి. వీర మహిళలకు రక్షణగా నిలబడండి. వారికి ఎలాంటి ఆపద వచ్చినా జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకోండి. వీర మహిళలపై వ్యక్తిగతంగా, అసభ్యకరంగా మాట్లాడే వారిపై కచ్చితంగా పార్టీ జిల్లా అధ్యక్షులు బాధ్యత తీసుకొని జిల్లా ఎస్పీ అధికారుల వద్దకు సమస్యను తీసుకువెళ్లండి. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వీర మహిళలను రక్షించుకోవడం పార్టీ ప్రాథమిక బాధ్యత.
* నా నేతృత్వంలో క్రమశిక్షణ కమిటీ
పార్టీలో ఎంతటి నాయకులైనా సరే క్రమశిక్షణ తప్పొద్దు. మనం రాజకీయ శత్రువులతో పోరాడాలి తప్పితే, మనలో మనమే యుద్ధం చేసుకుంటే చూసే వారికి కూడా లోకువగా ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో క్రమశిక్షణ తప్పితే మాత్రం ఊరుకునేది లేదు. దీనిపై త్వరలోనే క్రమశిక్షణ కమిటీని నియమిస్తాం. ఈ కమిటీకి నేనే నేతృత్వం వహిస్తాను. ఎవరి పరిధి వారికి ఉంటుంది. పార్టీలో కచ్చితంగా ఒక ప్రోటోకాల్ అనేది ఉంటుంది. దానిని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ప్రతి దానికి సోషల్ మీడియా ఎక్కి రచ్చ చేస్తే మాత్రం సహించేది లేదు. పార్టీని కాపాడుకోవాలంటే కచ్చితంగా జన సైనికుల దగ్గర నుంచి వారిని నడిపించే నాయకుల వరకు క్రమశిక్షణ పాటించాల్సిందే. ఏమైనా సమస్యలు ఉంటే నాలుగు గోడల మధ్యన చర్చ జరగాలి తప్పితే, బహిరంగంగా మాట్లాడితే మాత్రం కచ్చితంగా చర్యలు ఉంటాయి. ఒక వేళ పార్టీ తీరు నచ్చకపోతే మీరు వేరే పార్టీలోకి వెళ్లినా అభ్యంతరం లేదు. అంతేగాని పార్టీలో ఉండి మాత్రం కట్టు తప్పొద్దు. పార్టీలో ఉండి ఇతర పార్టీ నాయకులతో రాజకీయాలు చేసే నాయకుల తీరు నాకు అసలు నచ్చదు. సొంత పార్టీకి ద్రోహం చేసి ఇతరులతో కలిసే నాయకుల తీరు నాకు తెలుసు.
* అప్రమత్తంగా ఉండండి
పార్టీ నిర్మాణ క్రమంలో భాగంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇప్పిస్తాం.. పదవులు ఇస్తాం అని ప్రచారం చేసే నాయకులపై అప్రమత్తంగా ఉండండి. జిల్లాల అధ్యక్షులు ఇలాంటి వారిపై దృష్టి పెట్టండి. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను ఏమాత్రం విస్మరించవద్దు. వారికి అర్ధరాత్రి కష్టం వచ్చినా సరే జిల్లా స్థాయి నాయకులు కదిలి వెళ్లాలి. మేమున్నామని భరోసా వారికి కచ్చితంగా కల్పించాలి” అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, శ్రీ కోన తాతారావు, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ కనకరాజు సూరి, శ్రీ చేగొండి సూర్యప్రకాష్, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హం ఖాన్, పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివ శంకర్, శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం, జిల్లా అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కొటికలపూడి గోవిందరావు, శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీ షేక్ రియాజ్, శ్రీ మనుక్రాంత్ రెడ్డి, డా.పసుపులేటి హరిప్రసాద్, శ్రీ టి.సి.వరుణ్, శ్రీ పోతిన వెంకట మహేష్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పి.హరిప్రసాద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *