నేడు ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం వైఎస్ జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏపీలో ఆందోళనల వేళ జగన్ ఢిల్లీకు వెళ్లడం కొత్త చర్చకు దారి తీస్తోంది. అకస్మాత్తుగా జగన్ ఢిల్లీకి వెళ్లడానికి కారణాలేంటని పార్టీ వర్గాల్లోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో వైఎస్ జగన్ భేటీ అవ్వనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్‌ని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం బకాయిలతో సహా పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ వెళ్లనున్న నేపధ్యంలో ఈ ఉదయం ఆర్థిక శాఖ అధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారు. క్యాంప్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమీక్ష జరగనుంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిల వివరానలు ఆయన అడిగి తెలుసుకోనున్నారు.