శ్రీ మోదీ ‘మన్ కీ బాత్’కి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు స్వయంగా నిర్వహిస్తోన్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈ నెల 30వ తేదీతో 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న శుభ సందర్భంలో వారికి నా శుభాభినందనలు తెలియజేస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రధాని దేశవాసులతో రేడియో మాధ్యమం ద్వారా స్వయంగా ముచ్చటించే ఈ కార్యక్రమం శ్రోతలకు, తదుపరి టీవీ ప్రసారాల్లో చూసే వీక్షకులకు ఎంతో చేరువైంది. గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైన రేడియోలో వినడమో, టీవీలో చూడటమో జరిగింది. ప్రతి నెల 23 కోట్ల మంది ఆదరిస్తున్నారని తెలిసి సంతోషం వేసింది. 2014 అక్టోబర్ 3న విజయదశమి నాడు ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం నాడు నిరంతరాయంగా కొనసాగుతుండటం అద్భుతమైన విషయం. ప్రధాని శ్రీ మోదీ గారు ఈ కార్యక్రమంలో ప్రస్తావించే అంశాలు చాలా విభిన్నంగా ఉంటాయి. సామాన్యులు సాధించే విజయాలు, గొప్ప వ్యక్తులు, కళలు, చేతివృత్తులు, సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు… ఇలా అనేక అంశాలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గర చేశాయి. దానికి తోడు మోదీగారి వాక్పటిమ, వివిధ అంశాలపై వారికున్న విశేష అనుభవం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ సందేశంలో “సేవా పరమో ధర్మః” అని శ్రీ మోదీ గారు పేర్కొనడం మనసులను హత్తుకునే విధంగా ఉంది. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, కార్యక్రమ నిర్వాహకులకు నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *