తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తెలంగాణలో ఈ నెల 14న జరిగిన రెండు పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా.. ఏపీలో రెండు ఉపాధ్యాయా ఎమ్మెల్సీ స్థానాకలు ఓటింగ్‌ జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం అయ్యింది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానానికి సంబంధించిన ఓట్లను సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో లెక్కించనుండగా వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానానికి సంబంధించిన ఓట్లను నల్లగొండ పట్టణంలోని మార్కెట్‌ శాఖ గిడ్డంగిలో లెక్కించనున్నారు. కాగా రెండు స్థానాల్లోనూ పోటీ చేసిన అభ్యర్థులు భారీగా ఉండటంతో ఫలితాలపై స్పష్టత ఒక రోజు తర్వాతే రానుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాగా వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానంలో మొత్తం 5,05,565 ఓట్లకుగాను 3,86,320 ఓట్లు అంటే 76.41% శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో 5,31,268 ఓట్లకుగాను 3,57,354 అంటే 67.25% ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్‌ స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీపడగా ప్రధాన పోటీ సురభి వాణీదేవి (టీఆర్‌ఎస్‌), ఎన్‌. రామచందర్‌రావు (బీజేపీ), మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె. నాగేశ్వర్‌రావు(ఇండిపెండెంట్‌) మధ్య నెలకొంది. నల్లగొండ స్థానం నుంచి 71 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), ప్రొఫెసర్‌ ఎం. కోదండరాం (టీజేఎస్‌) మధ్య నెలకొంది.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఇలా..

ఓట్ల లెక్కింఉ కోసం ఒక్కో హాల్‌లో 7 టేబుళ్ల చొప్పున 8 హాళ్లలో మొత్తం 56 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి రౌండ్‌లో ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్ల చొప్పున 56 వేల ఓట్లను లెక్కించనున్నారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్‌ పేపర్లను కలిపేసి 25 ఓట్ల చొప్పున ఒక బండిల్‌ చేశాక.. ఒక్కో టేబుల్‌కు వెయ్యి ఓట్లు (40 బండిళ్లు) ఇచ్చి లెక్కిస్తారు. అంటే ఒక రౌండ్‌కు 56 వేల చొప్పున ఓట్లను లెక్కించనుండగా… మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తి కావడానికి కనీసం 10-12 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.

తొలి ప్రాధాన్య ఓట్ల ఫలితం 18న ఉదయం 8 గంటలకుగానీ తేలదని అంటున్నారు. ఫస్ట్‌ ప్రియారిటీ ఓట్ల లెక్కింపు సమయంలోనే చెల్లని ఓట్లను పక్కన పెట్టి వాటి లెక్క కూడా తీస్తారు. మొత్తం పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేశాకే అభ్యర్థి గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు. ఆ కోటా మేరకు ఎవరికైనా మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చినట్లయితే విజేతగా ప్రకటించి కౌంటింగ్‌ నిలిపివేస్తారు. ఒక్కో రౌండ్‌కు 56 వేల ఓట్ల చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు 7 రౌండ్లు పట్టనుంది. గెలవడానికి సరిపడా మొదటి ప్రాధాన్య ఓట్లు ఎవరికీ రాకపోతే రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు.