త్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకాలు: అపోలో చైర్మన్

త్వరలో పిల్లలకు కొవిడ్‌ టీకాలు అందించనున్నట్లు అపోలో గ్రూపు ఛైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సి రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తొలుత సహరుగ్మతలు(కోమార్బిడిటీస్‌)తో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తామన్నారు. ఆమోదం రావాల్సి ఉందన్నారు. ‘2-18 సంవత్సరాల వయసుల వారికి కొవాగ్జిన్‌ టీకా సిద్ధమైంది. 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదుల్లో ఇవ్వాలి. ఇంట్రా-మస్కులరీ విధానంలో వేస్తారు. 12-18 సంవత్సరాల వయసు వారికి జైకోవ్‌-డి టీకా 28 రోజుల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వాలి. ఇది సూది రహిత వ్యాక్సిన్‌’ అని పేర్కొన్నారు. టీకాలతోనే పిల్లలకు పూర్తి రక్షణ అన్నారు. వయస్సు-సమూహ వివరాలు అందిన తరువాత కార్యక్రమం ప్రారంభించనున్నామని చెప్పారు.