జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ-ఓటింగ్‌ సదుపాయం

రాష్ట్ర ఎన్నికల కమిషన్ త్వరలో జరగనున్నGHMC ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది.  ఈ ఎన్నికల్లో తొలిసారిగా ఈ-ఓటింగ్‌ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బంది, వృద్ధులు, కరోనాతో క్వారంటైన్‌లో ఉన్న వారికి ఈ-ఓటింగ్‌ విధానంలో ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి పేర్కొన్నారు. ఈ-ఓటింగ్‌ విధానంపై ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ అధికారులు చర్చించినట్లు తెలిపారు.

సాధ్యమైనంత త్వరలో డెమో ఇవ్వాలని కోరినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో వృద్ధులు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ఇబ్బందిగా మారుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌ సోకిన, వారు కలిసిన వారంతా క్వారంటైన్‌లో ఉంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఓటింగ్‌ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. వృద్ధులతో పాటు క్వారంటైన్‌లో ఉన్న వారంతా తాము ఉన్న ప్రాంతం నుంచే ఓటు హక్కును వినియోగించుకునే వీలు కలుగనుంది. అలాగే పోలింగ్‌లో పాల్గొనే సిబ్బంది కోసం ప్రస్తుతం ముందస్తుగా పోస్టల్‌ బ్యాలెట్‌ విధానాన్ని అవలంభిస్తున్నారు. ఈ ఓటింగ్‌ విధానం అమలులోకి వస్తే ఓటింగ్‌ శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.