ఆవిర్భావ సభ విజయానికి అందరూ కలసి రావాలి

*వీడియో సందేశంలో ఎన్.ఆర్.ఐ. జనసైనికులకు నాదెండ్ల మనోహర్ పిలుపు
*ఇతర రాష్ట్రాలవారికీ త్వరలో క్రియాశీలక సభ్యత్వం

రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆవిర్భావ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం యావత్తు రాష్ట్రం ఎదురు చూస్తోందని తెలిపారు. ఈ సభా వేదిక నుంచే భవిష్యత్తు కార్యచరణ, పార్టీ పరంగా తీసుకోవాల్సిన కొన్ని రాజకీయ నిర్ణయాలపై అధ్యక్షులవారు ప్రసంగిస్తారని చెప్పారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు సాయం అందించాలని ఎన్ఆర్ఐ జనసైనికులకు ఒక వీడియో సందేశంలో పిలుపు నిచ్చారు. రాజకీయ పార్టీ అంటే టీమ్ ఎఫెక్ట్. మనందరం కలిసి కట్టుగా ఈ సభను విజయవంతం చేయాలి. ఏ ఏ గ్రామాల్లో జనసైనికులు యాక్టివ్ గా పనిచేస్తున్నారో గమనించి, వారికి మీ వంతు ఉడతాభక్తిగా సాయం అందిస్తే అది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది. మనదేశంలోని ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న జనసైనికులు, వీరమహిళలకు కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదుకు అవకాశం కల్పిస్తాం. అయితే ఆవిర్భావ సభ అనంతరం ఈ విషయంలో ముందుకు వెళ్తాం. అందరూ గర్వపడే విధంగా మాకంటే ఒక రోజు ముందే మీరు వ్యవస్థాపన దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకమని” అన్నారు.