హోం క్వారంటైన్ లో గౌతమ్ గంభీర్

దేశంలో కరోనావైరస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు వరకు అందరూ కూడా కరోనావైరస్  బారిన పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ క్రికెటర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతం గంభీర్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. గంభీర్ నివాసంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు ఆయన ట్వీట్ వేదికగా వెల్లడించారు. కొవిడ్ టెస్టులకు గంభీర్ తన నమూనాలను పంపించాడు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని, ఎవరూ కూడా తేలికగా తీసుకోవద్దని గంభీర్ విజ్ఞప్తి చేశారు. అలాగే తన కుటుంబసభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అక్కడ కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. ప్రతి రోజు 6 వేలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ కొవిడ్ నిబంధనలు పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది.