గ్లాసు గుర్తు జనసేనకే – రెడ్డి అప్పలనాయుడు అభినందనలు

ఏలూరు: జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను కేటాయించిన కేంద్ర ఎన్నికల కమిషన్ కు జనసేన పార్టీ ఉభయ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు అభినందనలు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసిందన్నారు. అయితే ఇటీవల అధికార పార్టీకి చెందిన అవగాహన లేని కొంతమంది వ్యక్తులు కారు కూతలు కూస్తూ జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం రద్దు చేసిందని అసత్య ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ప్రకటనతో వారి నోళ్లు మూతపడ్డాయన్నారు. జనసేన పార్టీ పేరు వింటేనే అధికార పార్టీకి చెందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేసి తిరుగులేని ఆధిక్యత సాధిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన పార్టీ రాష్ట్రంలో అఖండ విజయం సాధించి ప్రజలు మెచ్చే విధంగా సుస్థిరమైన ప్రభుత్వం అందిస్తుందన్నారు. జనసేన, టిడిపి కూటమికి అఖండ విజయం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని రెడ్డి అప్పలనాయుడు చెప్పారు. గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడంతో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ లకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు తరపున రెడ్డి అప్పలనాయుడు అభినందనలు తెలిపారు.