పంటలు నష్టపోతే ప్రభుత్వం చోద్యం చూస్తోంది

•రైతుల్ని పలకరించే నాధుడు లేడు
•రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదు
•నష్టపోయిన పంటకు ఎకరాకి రూ. 10 వేల తక్షణ పరిహారం ప్రకటించాలి
•రైతుకి రాజకీయం.. కులం అంటగడుతున్నారు
•ప్రతి రైతుకీ పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలి
•వైసీపీ పాలనలో రైతులు వ్యవసాయం అంటే భయపడుతున్నారు
•తెనాలి, కొల్లిపర మండలాల్లో నష్టపోయిన పంటల్ని పరిశీలించిన నాదెండ్ల మనోహర్

వైసీపీ పాలనలో రైతాంగం – వ్యవసాయం అంటే ఆలోచించే పరిస్థితులు వచ్చాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. తుపాను వచ్చి పంటలు నష్టపోతే పలకరించే నాథుడు లేడని ఆరోపించారు. కౌలు రైతుల్ని అసలు పట్టించుకునే పరిస్థితులే లేవన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదన్నారు. రైతుకి రాజకీయం.. కులం అంటగట్టడం ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం తెనాలి, కొల్లిపర మండలాల్లో తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. తేలప్రోలు, అత్తోట గ్రామాల పరిధిలో మొలకలు వచ్చేసిన వరిని రైతులు శ్రీ మనోహర్ గారికి చూపించారు. ఇంత నష్టం వచ్చినా కనీసం పంట నష్టం అంచనా వేసేందుకు కూడా ఎవ్వరూ రాలేదని వాపోయారు. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం వల్లే ఎక్కువ నష్టం వాటిల్లిన విషయాన్ని వివరించారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ…”రైతు పరిస్థితి దారుణంగా ఉంది. వరుసగా మూడేళ్లుగా పంటలు నష్టపోతూనే ఉన్నారు. తెనాలి, కొల్లిపర మండలాల్లో కలిగిన పంట నష్టం చూస్తే బాధ కలుగుతోంది. ప్రభుత్వం, యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్ధం అవుతోంది. వీఆర్వోలు, వాలంటీర్లు, వ్యవసాయ అధికారులు ఎవ్వరూ పొలాల్లోకి రాలేదు. వేల కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల నుంచి ఒక్క అధికారి గాని, స్థానిక ప్రజా ప్రతినిధులుగాని వచ్చి రైతులను ఓదార్చకపోవడం అన్యాయం. వరుసగా జరుగుతున్న పంట నష్టం గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ప్రతి రైతు ఎకరాకి రూ.30 వేలు ఖర్చు చేశారు.
* పంట కాలువల్లో పూడిక కూడా తీయలేదు
పంట నష్టం వాటిల్లితే కనీసం అంచనాలు వేయడం లేదు. కౌలు రైతుల్ని అయితే పూర్తిగా గాలికి వదిలేశారు. విత్తనం లేదు, ఎరువు ఇవ్వడం లేదు. కనీసం పంట కాలువల్లో పూడిక కూడా తీయలేదు. జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఏమయ్యాయో అర్ధం కావడం లేదు. రైతులు సమస్యల్లో ఉంటే ప్రభుత్వానికి స్పందించే మనస్థత్వం ఎందుకు లేకుండా పోయిందో అర్ధం కావడం లేదు.
* రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం
కౌలు రైతుల్ని పట్టించుకోకపోవడం వల్ల దిక్కులేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గుంటూరు లాంటి జిల్లాలోనే 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో రైతు భరోసా సభ నిర్వహించి కుటుంబానికి రూ. లక్ష చొప్పున శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆర్థిక సాయం అందచేయనున్నారు. అదే వేదిక నుంచి నష్టపోయిన రైతుల తరఫున ప్రభుత్వాన్ని పరిహారం డిమాండ్ చేస్తారు. పంట నష్టంపై ముఖ్యమంత్రి స్పందించాలి. వ్యవసాయ శాఖ నుంచి నివేదిక తెప్పించుకుని ప్రతి రైతుని ఆదుకునే ఏర్పాటు చేయాలి. గత ఏడాది తుఫాను వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున నిరసన దీక్షలు చేపట్టాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రైతాంగానికి మేలు చేసే విధంగా ప్రతి రైతుకీ రూ. 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తే.. రూ. 6 వేలు చొప్పున ఇచ్చారు. అదీ తూతూ మంత్రంగా కొంత మందికి మాత్రమే ఇచ్చారు. ఈసారి సంభవించిన విపత్తు కారణంగా రైతులకు అపార నష్టం సంభవించింది. ఎకరాకి రూ. 10 వేల చొప్పున తక్షణ పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వ విధానాల కారణంగా యువత వ్యవసాయ రంగానికి దూరమైపోతున్నారు. దేశంలో ఇప్పటికీ 70 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం అయితే, ఇలాంటి రంగాన్ని నిర్లక్ష్యం చేయడం దారుణం. నియోజకవర్గంలో ఏడు లక్షల 75 వేల క్వింటాళ్ల పంట పండితే ఇప్పటి వరకు కేవలం 900 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. ఆర బెట్టిన ధాన్యాన్ని కూడా తేమశాతం పేరు చెప్పి ఇబ్బంది పెడుతున్నారు.. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకుని రైతాంగానికి అండగా నిలబడతాం అని అన్నారు.
*రైతు భరోసా కేంద్రం పరిశీలన
ఈ పర్యటనలో భాగంగా చివలూరులో రైతు భరోసా కేంద్రాన్ని శ్రీ మనోహర్ గారు పరిశీలించారు. రైతుల వద్ద ఎంత ధాన్యం కొన్నారు? ఏ పద్దతిలో కొంటున్నారు? కొన్న ధాన్యానికి ఎన్ని రోజుల్లో డబ్బు చెల్లిస్తున్నారు? ఎరువులు ఎంత మందికి ఇచ్చారు? తదితర అంశాలపై ఆరా తీశారు. ధాన్యంలో తేమ తనిఖీ చేసే యంత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు… ధాన్యం కొనుగోళ్ల సమయంలో గోనె సంచులు అందించకపోవడం తదతర సమస్యలు శ్రీ మనోహర్ గారి దృష్టికి తీసుకువచ్చారు.