కలెక్టర్ విచారణకు సిద్ధమా?.. తోట త్రిమూర్తులుకు వేగుళ్ళ లీలాకృష్ణ సవాల్

రాజకీయ సన్యాసంకు కట్టుబడి ఉండాలి

మండపేట: తోట త్రిమూర్తులు భూ కబ్జా వ్యవహారంలో కలెక్టర్ విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ మండపేట జనసేన ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ప్రతి సవాల్ విసిరారు. మండపేట బాబు & బాబు కన్వర్షన్ హాలులో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేగుళ్ళ లీలాకృష్ణ మాట్లాడుతూ భూములు కొన్నట్లు ధ్రువీకరణ చూపిస్తున్న తోట తాను ఆయనపై చేసిన ఆరోపణలకు జవాబు చెప్పగలరా అంటూ నిలదీశారు. కోర్ట్ కేసు ఉపసంహరణ చేసి కలెక్టర్ విచారణకు సిద్ధంగా ఉన్నానని తోట చెప్పారని దీనికి కట్టుబడి ముందు కేసు ఉపసంహరణ చేయాలని డిమాండ్ చేసారు. ఆయనే ప్రభుత్వంలో ఉన్నారని తక్షణమే దీనిపై విచారణ కమిషన్ నీయమించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ వద్ద ఎప్పడు విచారణ అంటే తాము అప్పుడు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాను సమాచారం హక్కు ద్వారా తోట వివరాలు కోరుతున్న మాట వాస్తవమే నని పేర్కొన్నారు. రామచంద్రపురంలో ఆర్ టిసి కాంప్లెక్స్ స్థలం కాజేశారని ఆరోపించారు. అక్కడ రహదారి కూడా అక్రమించారని ఇవన్నీ ఆర్ టి ద్వారానే బయట పడ్డాయని తెలిపారు. అదే రామచంద్రపురం పట్టణంలో సూర్య సినిమా హాల్ అక్రమంగా నిర్మాణం చేపట్టారని దీనిపై ప్లాన్ అడిగితే రామచంద్రపురం కమిషనర్ వివరాలు ఇవ్వడం లేదని విమర్శించారు. దీనిపై సమాచారం హక్కు చట్టం కమిషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా కాజులూరు మండలంలోని భూ అక్రమ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేసారని, దానిపై ఆర్ డి ఓ అక్రమాలు గుర్తిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని వాటి కాపీలు అందజేశారు. బోస్ రెవెన్యూ మంత్రిగా ఉన్నపుడు ఈ ఆర్డర్ వచ్చిందని, దీంతో తోట గత్యంతరం లేక వైసీపీలో చేరారని విమర్శించారు. కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడి కాళ్ళు వేళ్ళు పట్టుకుని వైసీపీలో చేరారని ఆరోపించారు. ఇప్పుడు భూ కబ్జా పై జనసేన తరపు ప్రశ్నిస్తే ఉల్లికిపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికీ తాను చేసిన ఆరోపణలను రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇక తోట రాజకీయ సన్యాసంకు సిద్ధంగా ఉండాలని హితవు పలికారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సరకుల అబ్బులు, మండపేట మండల అధ్యక్షులు కుంచె ప్రసాద్, నామాల చంద్రరావు, వాసిరెడ్డి అర్జున్, చింత దొరబాబు, మామిడాల మనోకృష్ణ, బొమ్మన సతీష్, పొలమురి విజయ్, ర్యాలీ బ్రహ్మజీ తదితరులు పాల్గొన్నారు.