ఈ నెల 4న జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం

జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 4వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితోపాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, పీఏసీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు జిల్లా అధ్యక్షులు, వివిధ విభాగాల ఛైర్మన్లు, నియోజకవర్గ ఇంఛార్జిలు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, వీరమహిళ ప్రాంతీయ కమిటీ సభ్యులు పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సుమారు 4 గంటల పాటు కొనసాగనుంది. ప్రధానంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, జనసేన కార్యకర్తలపై అక్రమ కేసుల బనాయింపు, జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర తదితర అంశాలపై లోతుగా చర్చిస్తారు. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలను ఆమోదిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు 3వ తేదీ సాయంత్రం మంగళగిరి చేరుకుంటారు.