రోడ్డు ప్రమదంలో మరణించిన ప్రసన్న కుటుంబానికి అండగా జనసేన

కృష్ణాజిల్లా: సైకిల్ అదుపుతప్పి బాలిక రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని చల్లపల్లి మండలం చల్లపల్లి నారాయణరావు నగర్ లో శనివారం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు నారాయణరావు నగర్ కు చెందిన రాపూరి శ్రీనివాసరావు కుమార్తె ప్రసన్న స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. ఆమె ఉదయం సైకిల్ పై తన అక్కను ఎక్కించుకొని నారాయణ రావు నగర్ ప్రధాన రహదారిపై వస్తుండగా 6 నెంబర్ పంట కాలువ వంతెన దాటిన తర్వాత సైకిల్ అదుపు తప్పి ప్రధాన రహదారిపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ప్రసన్న కు నేలదెబ్బ తగలడంతో అక్కడ స్పృహ కోల్పోవడంతో పాటు కొద్ది క్షణాల్లోనే తుది శ్వాస విడిచింది. రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న జనసేన నాయకులు అక్కడకు చేరుకుని బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్ లు, మండల అధ్యక్షులు విమల్ కృష్ణ చోడగం టౌన్ అధ్యక్షులు ప్రసాద్ ముత్యాల, ఐటి కోఆర్డినేటర్ నంద సుధాని, రాఘవ సోమిశెట్టి, రవి పసుపులేటి, మల్లం నాంచారయ్య లు బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించడంతోపాటు ప్రసన్న మట్టి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ 5000 ఆర్థిక సహాయాన్ని అందించారు. శ్రీనివాసరావుకు నలుగురు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె కు వివాహం జరగగా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఉన్న ముగ్గురు కుమార్తెలలో ప్రసన్న ఒక్కరు. కళ్ళముందే కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో కుమార్తె తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు దుఃఖ సముద్రంలో మునిగారు. బాలిక మృతి చెందడంతో నారాయణరావు నగర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.