శెట్టిబలిజల గురించి మాట్లాడే అర్హత జూపూడికి లేదు: వేగుళ్ళ లీలాకృష్ణ

*శెట్టిబలిజలను దూషించడం తగదు..
*జూపూడి ప్రభాకర్ మాటలు వెనక్కి తీసుకోవాలి..
*తక్షణమే క్షేమపణలు చెప్పాలి..
*మండపేట ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆగ్రహం..

మండపేట: ప్రభుత్వ సలహాదారుడు జూపూడి ప్రభాకర్ రావు శెట్టిబలిజల జాతి పట్ల మాట్లాడిన భాష, వాడిన పదాలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శెట్టిబలిజలు నిత్యం గంజాయి, మద్యం మత్తులో ఉంటారని.. జూపూడి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దారుణమని పేర్కొన్నారు. జూపూడి ప్రభాకర్ కు శెట్టిబలిజల జాతి గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. తక్షణమే క్షేమపణలు చెప్పి, మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు మీరు గతంలో వైసీపీ రొమ్ము గుద్ది టిడిపిలో జాయిన్ అవడం, మళ్లీ వైసీపీ అధికారంలోకి రాగానే టిడిపి రొమ్ము గుద్దడం మీకు అలవాటని చెప్పారు. మరొకసారి శెట్టిబలిజలపై దుర్భాశలాడితే ఇకపై నీ భాషలోనే బదులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.

అంబేద్కర్ గారిని ఒక కులానికే పరిమితం చేయడం దారుణం…

అంబేద్కర్ అనే మహనీయుడు ఒక రాజ్యాంగ నిర్మాతగా దేశంలోని అన్ని వర్గాలకు ఆరాధ్యుడు, దైవం. మీరు మాటి మాటికి మా నాయకుడు అని చెప్పి ఆయనను కొందరికి మాత్రమే పరిమితం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇకపోతే కోనసీమ జిల్లా ఇష్యూను తెలివిగా అంబేద్కర్ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ గారు అప్పట్లో సమసమాజ స్థాపన కోసం కొన్ని సంవత్సరాలు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. కానీ మీలాంటి రాజకీయ నాయకులు లోపభూయిష్టమైన విధానాలతో మరియు ఓటు బ్యాంక్ రాజకీయాలతో దాన్ని వందల సంవత్సరాలకు తీసుకువచ్చారని అన్నారు. అంతిమంగా చూస్తే దళిత వర్గాల్లో కనీసం 30 శాతం కుటుంబాలు కూడా సమసమాజ స్థాపన స్థాయి వరకు రాలేదనేది కళ్ళకు కట్టిన వాస్తవమని తెలిపారు. ఇలాంటి సున్నితమైన సమస్య వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి గొడవలు సృష్టించడం మీ పార్టీకి బాగా తెలుసని విమర్శించారు.