జన సైనికులకు… వీర మహిళలకు న్యాయపరమైన అంశాల్లో చేయూతనివ్వండి

* లీగల్ సెల్ సభ్యులతో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు
జన సైనికులు, వీర మహిళలు సామాజిక బాధ్యతతో తమ గళం విప్పి ప్రశ్నిస్తుంటే వారిపై దాడులకు తెగబడుతున్నారు. వై.సీ.పీ. ప్రభుత్వం జన సైనికులపై, వీర మహిళలపై సంబంధం లేని కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జనసైనికులకు, వీర మహిళలకు న్యాయపరమైన అంశాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు చేయూతనివ్వాలని జనసేన పార్టీ పీ.ఏ.సీ. సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు సూచించారు. ఆదివారం రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన లీగల్ సెల్ సభ్యులు కొందరు నాగబాబు గారిని కలిశారు. ఈ సందర్బంగా వారితో మాట్లాడుతూ.. జన సైనికులపై, వీర మహిళలపై గతంలో దాడులు చేసిన సందర్భాలు, న్యాయపరంగా చిక్కుల్లో నెట్టేసిన అంశాలు పునరావృతం కాకుండా భరోసానివ్వాలని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి భావజాలానికి అనుగుణంగా పని చేస్తూ, ఆయన ఆశయాల్నీ, సిద్ధాంతాలను గెలిపించుకునేందుకు పోరాడుతున్న జన సైనికులను, వీర మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని పునరుద్ఘాటించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల పర్యటనలో ఉన్న నాగబాబు గారిని వివిధ ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, పార్టీ శ్రేణులు కలిశారు. జనసేన పార్టీ అధికారంలోకి రావల్సినటువంటి ఆవశ్యకతను ప్రతినిధులు ముక్తకంఠంతో వివరించారు.