జనసేనాని నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి!

  • నరసాపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిర్వహించే పవన్ కళ్యాణ్ బహిరంగ సభను, 22వ తేదీ సోమవారం నామినేషన్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని నరసాపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులకు పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలను ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనకు అవకాశం వచ్చిందని అన్నారు. గత ఐదు సంవత్సరాల కాలంలో కూల్చివేతలతో ప్రారంభమైన జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. నరసాపురం నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ప్రధానంగా త్రాగునీరు, రోడ్లు నియోజకవర్గంలో పెద్ద సమస్యగా మారింది అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నర్సాపూర్ పర్యటన సందర్భంగా 3,300 కోట్లతో శంకుస్థాపన చేసిన పనులు ఏ ఒక్కటి నేటికీ పూర్తి కాలేదు అన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని నాయకర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పొత్తూరి రామరాజు, బిజెపి కన్వీనర్ మేకల సతీష్ లు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లిన కూటమి అభ్యర్థి నాయకర్ను గెలిపించడానికి ప్రజలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అన్నారు. గత ఐదు సంవత్సరాలు కాలంలో అన్ని రకాల రైతంగం తీవ్రంగా నష్టపోయారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను వైసిపి ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రం 10 సంవత్సరాల వెనక్కి వెళ్లిందని వారు గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా ఉండాలంటే తక్షణం జగన్ను గద్దె దించాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని భారీ కేక్ కట్ చేశారు. సమావేశంలో కూటమి నాయకులు జక్కం బాబ్జి, కలవకొలను తాతాజీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వర్ధనపు ప్రసాద్, వలవల నాని, జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడ రవి, కొల్లు పెద్దిరాజు, గంట కృష్ణ, కంచర్ల నాగేశ్వరావు, పోలిశెట్టి నళిని తదితరులు పాల్గొన్నారు.