పాఠ్యాంశాల బోధనా భాష పై కీలక వ్యాఖ్యలు చేసిన మోదీ

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్​ఈపీ 21వ శతాబ్దంలో విద్యారంగంలో కొత్త శకానికి నాంది పలికిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2020 నూతన విద్యావిధానంలో పాఠశాల విద్యపై జరుగుతున్న సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. కొత్త విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల నూతన విద్యాభ్యాసానికి 5 సూత్రాల మంత్రాన్ని సూచించారు. కొత్త విద్యా విధానంపై ‘మై గవ్’ పోర్టల్‌లో కేవలం వారం రోజుల వ్యవధిలోనే 15లక్షల సూచనలు, సలహాలు వచ్చాయని తెలిపారు. దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత, ఒక్కో సంప్రదాయ కళ, పని విధానం ఉందన్నారు మోదీ.

విద్యార్థుల మార్కుల జాబితా అనేది చిన్నారులకు ప్రెజర్ షీట్‌గా, తల్లిదండ్రులకు ప్రెస్టేజ్ షీట్‌గా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. NEP-2020తో ఇకపై ఆ సమస్య తొలగిపోనుందని ఆయన పేర్కొన్నారు.

పాఠశాలల్లో బోధనా భాషపై కూడా ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాషలో బోధించడంవల్ల విద్యార్థులు ఏ విషయాన్నైనా సులువుగా అర్థం చేసుకోవడంతోపాటు మరింత జ్ఞానాన్ని సంపాదించగలుగుతారన్నారు. భాష అనేది జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక సాధనమని.. భాషే జ్ఞానం కాదని అయన పేర్కొన్నారు. కేవలం బుక్ నాలెడ్జ్ కు పరిమితమైన జనం ఈ తేడాను గమనించడంలేదన్నారు. ఏ భాషలో బోధిస్తే చిన్నారులు తేలికగా గ్రహిస్తారో అదే బోధనా భాష అని ప్రధాని స్పష్టం చేశారు. జపాన్‌, ఐర్లాండ్‌, పోలాండ్‌, ఫిన్లాండ్‌, దక్షిణ కొరియా దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అందుకే కనీసం 5వ తరగతి వరకైనా బోధన మాతృభాషలోనే ఉండాలని NEP-2020 సూచిస్తోందని మోదీ చెప్పారు. అయితే మాతృభాషలో బోధనతోపాటు, ఇంగ్లీష్ సహా ఇతర భాషలు నేర్చుకోవడంపై ఎలాంటి పరిమితులు ఉండవని మోదీ వెల్లడించారు.